
Sai Dharam Tej

బాహుబలి వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది మ్యాటరే కాదు.. కానీ అది అన్నిసార్లు కాదు.. సినిమాలో మ్యాటర్ ఉన్నపుడే బడ్జెట్ ఎంతైనా వర్కవుట్ అవుతుంది. అలా కాకుండా మీడియం రేంజ్ హీరోలతో చేసే మాస్ సినిమాలకు కూడా 100 కోట్లు పెట్టమంటే నిర్మాతలు నిర్ధాక్షణ్యంగా నో చెప్తున్నారు. అలా ఈ మధ్య చాలా సినిమాలు అనౌన్స్మెంట్లోనే ఆగిపోయాయి.

కథాబలం ఉన్న సినిమాలకు ఓకే కానీ.. రొటీన్ సినిమాలకు మాత్రం బడ్జెట్ లెక్కలు పక్కాగా వేసుకుంటున్నారు నిర్మాతలు.. తేడా వస్తే సినిమాలే ఆపేస్తున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా ఆగిపోవడానికి కారణం బడ్జెట్టే. హిట్ కాంబినేషన్ అయినా.. బడ్జెట్ పెరిగిపోతుందని ఈ చిత్రాన్ని ఆపేసారు మైత్రి మూవీ మేకర్స్. తాజాగా సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ పరిస్థితి కూడా ఇదే అయ్యేలా కనిపిస్తుంది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమాను అనౌన్స్ చేసారు సితార ఎంటర్టైన్మెంట్స్. అయితే బడ్జెట్ ఇష్యూస్ ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తుంది. అనుకున్న దానికంటే బడ్జెట్ చేతులు దాటిపోతుండటంతో గాంజా శంకర్ ఆదిలోనే అటకెక్కేసింది. దాంతో మరో ప్రాజెక్ట్పై ఫోకస్ చేయనున్నారు సాయి ధరమ్ తేజ్.

తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి, నాని సినిమా కూడా బడ్జెట్ కారణంగానే ఆగిపోయింది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించాలనుకున్నా.. ప్రీ ప్రొడక్షన్లోనే ఖర్చు 100 కోట్లు అవుతుందని తేలడంతో పక్కన బెట్టేసారు. శివ కార్తికేయన్ డాన్ సినిమాతో శిబి బ్లాక్బస్టర్ ఇచ్చినా.. బడ్జెట్ భారీగా చెప్పడంతో ప్రాజెక్ట్ ఆపేసారు. మొత్తానికి మన నిర్మాతలు ఇన్నాళ్ళకు మొహమాటాలు వదిలేయడం మంచి విషయమే.