
2025లో జరిగే ఆస్కార్ వేడుకలో ఇండియా తరువాత లాపతా లేడీస్ సినిమా బరిలో దిగుతోంది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో పోటి పడుతోంది. ఈ సారి ఎలాగైన అవార్డు సాధించాలన్న కసితో ఉన్న ఆమిర్, ప్రమోషన్ విషయంలో జక్కన్న ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు.

ట్రిపులార్తో ఇండియన్ సినిమాకు తొలి ఆస్కార్ను సాధించిపెట్టారు దర్శక ధీరుడు జక్కన్న. ఆస్కార్ దక్కింది ట్రిపులార్ పాటకే అయినా... అసలు అక్కడి దాకా సినిమాను తీసుకెళ్లటంలో రాజమౌళి ప్లానింగే కీ రోల్ ప్లే చేసింది. భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో నిలవాలంటే ఏం చేయాలన్న గైడ్లైన్స్ సెట్ చేసింది.

తన సినిమా కోసం జక్కన్న వేసిన బాటలోనే నడుస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. 2025 మార్చిలో జరగబోయే ఈవెంట్ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలు పెట్టారు. తొలి ప్రయత్నంగా సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్కు చేరువ చేసేందుకు లాపతా లేడీస్ టైటిల్ను లాస్ట్ లేడీస్ అని మార్చారు.

ఆస్కార్స్ టైమ్లో ట్రిపులార్ టీమ్ హాలీవుడ్ మీడియాకు రెగ్యులర్గా ఇంటర్వ్యూలు ఇచ్చింది. వీలైనంత ఎక్కువగా ఆస్కార్ జ్యూరీ దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఆమిర్ కూడా అదే స్టైల్ను ఫాలో అవుతున్నారు.

ఆల్రెడీ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం స్టార్ట్ చేసింది ఆమిర్ టీమ్. ఈ నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో సినిమాను ప్రమోట్ చేసిన ఎలాగైన ఆస్కార్ సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఆమిర్. మరి ఆమిర్ అయినా ఇండియన్ సినిమాకు ఆస్కార్ సాధించి పెడతారేమో చూడాలి.