Tata Motors Outlets: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ దక్షిణ భారత్లో కొత్తగా 70 ఔట్లెట్లను శుక్రవారం ప్రారంభించింది. ఈ కొత్త విక్రయ కేంద్రాలు దక్షిణ భారత్లోని 53 నగరాల్లో విస్తరించి ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రధానంగా దక్షిణ భారత్లో విస్తరణ లక్ష్యంగా ఉన్నామని తెలిపిన కంపెనీ.. ఈ సరికొత్త ఆధునిక ఔట్లెట్లు కొత్త ప్యాసింజర్ మోడల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను విక్రయించేందుకు ఉద్దేశించినవని వెల్లడించింది.
‘దక్షిణ భారత్లో మొత్తం పరిశ్రమ విక్రయాల్లో 28 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న మార్కెట్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా కొనసాగుతామని తెలిపింది.
ప్రస్తుతం తమకు ఈ ప్రాంతంలో 12.1 శాతం వాటాను కలిగి ఉన్నాం. కొత్త ఔట్లెట్ల ద్వారా తమ వినియోగదారులకు సులభంగా కార్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు రాజన్ అంబ చెప్పారు.
కొత్తగా ప్రారంభించిన ఔట్లెట్లతో కలుపుకొని ఈ ప్రాంతంలో సంస్థకు మొత్తం 272 ఔట్లెట్లు ఉన్నాయి. అలాగే ఇండియా వ్యాప్తంగా మొత్తం 980 ఔట్లెట్లతో పాటు బెంగళూరులో 7, చెన్నైలో 5, హైదరాబాద్లో 4 సహా మొత్తం 32 కొత్త డీలర్షిప్లను ప్రారంభించామని కంపెనీ వెల్లడించింది.
ఆగస్టు నెలలో టాటా మోటార్స్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మొత్తం 57995 వాహనాలను విక్రయించింది. ఆగస్టు 2020 లో, కంపెనీ కేవలం 36505 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలు 54190 యూనిట్లుగా ఉన్నాయి. ఇది నెలవారీగా 4 శాతం, వార్షిక ప్రాతిపదికన 53 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 51 శాతం పెరిగి 28,018 యూనిట్లకు చేరుకున్నాయి, ఒక సంవత్సరం క్రితం ఇదే నెలలో 18,583 యూనిట్లు.