
రాష్ట్ర సహకార బ్యాంకు (NCB), జిల్లా సహకార బ్యాంకు (DCCB)ల విలీనానికి రంగం సిద్ధం అవుతోంది. ఇందుకు అనుసరించాల్సిన మార్గ దర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. ఇందుకు వీలు కల్పించే బ్యాంకుల నియంత్రణ చట్టం, 2020 గత నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కింది షరతులకు లోబడి డీసీసీబీలు ఎన్సీబీల్లో విలీనం కావచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డీసీసీబీలను ఆయా రాష్ట్రాల ఎస్సీబీల్లో విలీనం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర అధ్యయనం చేయాలి. అలాగే విలీన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాల నుంచే రావాలి. అదనపు మూలధన సమీకరణ వ్యూహాన్ని, అందుకు హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించాల్సి ఉంటుంది.

అలాగే విలీనం ఎలా లాభదాయకమో తెలుపాల్సి ఉంటుంది. ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ విలీన ప్రతిపాదనను నాబార్డ్ పరిశీలించి ఆర్బీఐకి సిఫారసు చేయాలి. ఈ ప్రతిపాదనను ఆర్బీఐ.. నాబార్డుతో కలిసి పరిశీలించి రెండు దశల్లో అనుమతి మంజూరు చేస్తుంది.