
చైనా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ సిచువాన్ ఎయిర్లైన్స్ భారత్కు 15 రోజుల పాటు కార్గో సేవలను నిలిపివేయడంపై భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్) ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల చైనా నుంచి దిగుమతి అవుతున్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్స్ (ఏపీఐ), డ్రగ్ ఇంటర్మీడియెట్స్, కీ స్టార్టింగ్ మెటీరియల్స్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు.

ఫినిష్డ్ ఫార్ములేషన్ల తయారీ, సరఫరా, ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశీయ పరిశ్రమ అధిక రవాణా ఛార్జీలు, కంటైనర్ల కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటోందని అన్నారు. అయితే భారత ఔషధ పరిశ్రమకు అవసరమైన 60-70 శాతం ఏపీఐ, కేఎస్ఎం, డ్రగ్ ఇంటర్మీడియెట్స్ చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి.

చైనా నుంచి దిగుమతి అవుతున్న ముడి ఔషదాల్లో 45-50 శాతం జాతీయ అత్యవసర ఔషధాల జాబితా ఉన్నాయి. ప్రభుత్వ ఏపీఐ, కేఎస్ఎంల తయారీని ప్రోత్సహించడానికి ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ.. స్వయం సమృద్ధిని సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో సహా అనేక ముఖ్యమైన ఔషధాల లభ్యతకు అంతరాయం ఏర్పడుతుందని, దేశీయ పరిశ్రమకు ముడి ఔషధాల సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కారణంగా చైనా నుంచి ముడి ఔషధాల సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిశ్రీకి లేఖ రాశారు.