
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పథకంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న విత్ డ్రా, పెన్షన్ నిబంధనలను మార్చింది. ఉద్యోగం చేస్తున్నప్పుడే పీఎఫ్ బ్యాలెన్స్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలను సవరించింది. గతంలో ఉన్న ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త కేంద్రం ఈపీఎఫ్ 2026 స్కీమ్ తీసుకొచ్చింది. జూన్ 29వ తేదీ నుంచి దీనిని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

కొత్త పథకం ప్రకారం పీఎఫ్ కాంట్రిబ్యూషన్, పాక్షిక ఉససంహరణ రూల్స్ మారాయి. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు పలు కారణాలతో పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. అయితే పీఎఫ్ బ్యాలెన్స్లో కనీసం 25 శాతం నిధులు తప్పనిసరిగా ఉంచాలి. మిగిలిన నిధిలో 50 నుంచి 75 శాతం వరకు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశముంటుంది. కొత్త పథకం ప్రకారం పీఎఫ్ ఖాతా నుండి పాక్షిక నిధులను ఉపసంహరించుకోవడానికి అనేక షరతులు విధించారు.

వైద్య చికిత్స కోసం 12 నెలల సర్వీస్ తర్వాత అర్హత గల బ్యాలెన్స్లో 100 శాతం వరకు స్వంతంగా లేదా కుటుంబ సభ్యుల కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుది. ఇక విద్య కోసం సర్వీస్ కాలంలో 10 సార్లు ఉపసంహరించుకోవచ్చు. వివాహ ఖర్చుల కోసం 5 సార్లు వరకు అనుమతి ఉంటుంది. ఇక గృహ కొనుగోలు, నిర్మాణం, మరమ్మతులు, లోన్ చెల్లింపు కోసం అర్హత గల బ్యాలెన్స్లో 100 శాతం వరకు తీసుకోవచ్చు

ఇక ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత బ్యాలెన్స్లో 100 శాతం వరకు తీసుకోవచ్చు. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రెండుసార్లు ఈ అవకాశం ఉంటుంది. ఈ మేరకు పాక్షిక విత్ డ్రాలపై కేంద్రం కఠిన ఆంక్షల విధించింది. ఉద్యోగులకు దీర్ఘకాలంలో ఆర్ధిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు తీసుకొచ్చింది.

ఇక నెలకు రూ.15 వేల కనీస శాలరీ పొందే ఉద్యోగులకు12 శాతం పీఎఫ్ వాటా తప్పనిసరి. అయితే నెలకు రూ. 1 లక్ష ప్రాథమిక జీతం పొందే ఉద్యోగి కూడా కేవలం రూ. 1,800 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు తప్పనిసరి మొత్తానికి మించి చెల్లించవచ్చు. కానీ ఆ అదనపు మొత్తాన్ని స్వచ్ఛందంగా పరిగణిస్తారు. 8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులపై ఈ నిబంధనలు ప్రభావం చూపనున్నాయి.