
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేవైసీ చేసుకునేందుకు జూన్ 30వ తేదీ వరకు గడువు విధించింది. అయితే గడువు ముగియడంతో సబ్సిడీ నిలిచిపోనుంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద కేంద్రం పేదలకు సిలిండర్ల బుకింగ్పై రూ.300 సబ్సిడీ అందిస్తోంది. కేవైసీ పూర్తి చేయనివారికి సబ్సిడీ కట్ కానుంది. అయితే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులే కాకుండా మిగతా సాధారణ వినియోగదారులు కూడా కేవైసీ పూర్తి చేయాలి.

చాలామంది చేసుకోకపోవడంతో వారి బుకింగ్స్ను తాత్కాలికంగా ఏజెన్సీలు నిలిపివేశాయి. అలాగే వారి గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా కట్ చేస్తున్నారు. దీంతో గ్యాస్ కనెక్షన్ తొలగిస్తే వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకోలేరు. తమకు ఆదేశాలు వచ్చాయని, అందుకే తొలగిస్తున్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి కనెక్షన్ ఎలా పొందాలో తెలియక తికమకపడుతున్నారు.

అయితే వినియోగదారులు తిరిగి గ్యాస్ కనెక్షన్ను పునరుద్దరించుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లాలి. వేలిముద్ర ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. వెంటనే మీ గ్యాస్ కనెక్షన్ పునరుద్దరించబడుతుంది. దీంతో యథావిధిగా సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ కట్ అయిందని వినియోగదారులు టెన్షన్ పడాల్సిన పని లేదు.

కేంద్రం గ్యాస్ కనెక్షన్, సిలిండర్ల సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్, అక్రమాలను నివారించేందుకు కేవైసీ ప్రాసెస్ తప్పనిసరి చేసింది. జూన్ 30లోగా చేసుకోవాలని కేంద్రం, గ్యాస్ కంపెనీలు పలుమార్లు కోరాయి. కానీ చాలామంది వినియోగదారులు నిర్లక్ష్యంతో చేసుకోలేదు. దీంతో వారి గ్యాస్ కనెక్షన్లను ఏజెన్సీలు తొలగిస్తున్నాయి.

అయితే కేవైసీ చేయించుకోవడంలో ఆలస్యమైతే శాశ్వతంగా గ్యాస్ కనెక్షన్ రద్దు చేసే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో ఇంకా చేసుకోని వినియోగదారులు త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఉచితంగా ఈ ప్రాసెస్ చేయవచ్చు. లేదా మీ ఏజెన్సీ వెబ్ సైట్, యాప్స్ ద్వారా చేసుకోవచ్చు.