
విమాన ప్రయాణం చేసేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. ప్రస్తుతం ఎయిర్పోర్టుల్లో ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయి. ఒక కప్పు టీ తాగాలన్నా రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇక మిగిలిన ఆహార పదార్ధాల ధరలు అయితే వందల్లో ఉంటున్నాయి. దీంతో విమాన ప్రయాణికులపై అధిక భారం పడుతుంది.

ఈ క్రమంలో భారత ప్రభుత్వం ప్రయాణికులకు తక్కువ ధరలో టీ, స్నాక్స్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ఎయిర్పోర్టుల్లో సొంతంగా ఉడాన్ యాత్రి కేఫ్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని ఎయిర్పోర్టుల్లో సామాన్యులకు అందుబాటు ధరల్లో స్నాక్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేఫ్లలో మెనూ సరసమైన ధరల్లో ఉంటుంది.

ఈ కేఫ్లలో టీ, వాటర్ బాటిల్ రూ.10గా ఉండనుండగా.. ఇక సమోసాలు రూ.20కే లభిస్తాయి. స్థానిక ఆహారాలను తక్కువ ధరకే అందిస్తారు. గత జనవరిలో కోల్కత్తా ఎయిర్పోర్టులో ఉడాన్ కేఫ్లను పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. ఇక ఆ తర్వాత విజయవాడ, పూణె, చెన్నై, భువనేశ్వర్, అహ్మదాబాద్ వంటి విమానాశ్రయాల్లో ప్రవేశపెట్టారు.

ఇక దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్వరలో ఉడాన్ కేఫ్ ప్రారంభం కానుంది. ఇక పూణె ఎయిర్పోర్టులో ఈ కేఫ్ను మహిళలు నిర్వహిస్తున్నారు. ఇక ధరలు తక్కువగా ఉన్నా.. నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. ఆహార పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తున్నారు.

త్వరలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో ఉడాన్ కేఫ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఎయిర్పోర్ట్కు ఒక ఉడాన్ కేఫ్ మాత్రమే కేటాయిస్తారు. విమానశ్రయ ప్రాంగణంలో ప్రీమియం ఫుడ్ కోర్టుల దగ్గరే ఈ కేఫ్లు ఏర్పాటు చేస్తారు. దీంతో విమాన ప్రయాణికులు ఇక అధిక ధరలు పెట్టి ఆహార పదార్థాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.