
ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఈరన్న అనే విద్యార్థి రావి ఆకుపై సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని గీసి ప్రతిభ చాటాడు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ సామ్రాజ్య వాదులకు ముచ్చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు.

అయితే ఈ సందర్భంగా పట్టణంలోని అమరావతి నగర్ లో నివాసముంటున్న సెంట్రింగ్ మేస్ర్తీ యం. నరసింహులు, యం.దేవికల పెద్ద కుమారుడు ఈరన్న, ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల 8వ తరగతి ఏ విభాగం లో చదువుతున్నాడు.

ఈ చిన్నోడు తన అద్భుతమైన ప్రతిభతో, రావి ఆకుపై నేతాజి సుభాష్ చంద్రబోస్ చిత్ర పటం ఆకృతిని తయారుచేసి అబ్బురపరిచాడు. పాఠశాల మండల విద్యాధికారి -2 శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థి ఈరన్న ను డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్. కీర ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా విద్యార్థి ఈరన్న మాట్లాడుతూ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేశానని, ఈ చిత్రం చేయడానికి 2 గంటల సమయం పట్టిందని తెలిపాడు. అనంతరం డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్. కీర మాట్లాడుతూ విధ్యార్థులలోని సృజనాత్మకతను నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, స్వతంత్ర సమరయోధుల గురించి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటామని తెలిపారు.