
మంచి మష్రూమ్స్ను ఎలా గుర్తుపట్టాలి: కొనేముందు మష్రూమ్స్ తెల్లగా, గట్టిగా ఉన్నాయో లేదో చూడాలి. మష్రూమ్స్పై తేమ ఎక్కువై జిగటగా మారినా, నల్లటి మచ్చలు ఉన్నా లేదా ముసల వాసన వస్తున్నా వాటిని అస్సలు కొనొద్దు. మష్రూమ్ పైన భాగం క్రింది వైపు మూసి ఉన్నట్లు ఉంటే అవి చాలా తాజాగా ఉన్నాయని అర్థం.

నీళ్లలో ఎక్కువసేపు నానబెట్టవద్దు: చాలామంది కూరగాయలు కడిగినగానే మష్రూమ్స్ను నీటితో నింపిన గిన్నెలో ఎక్కువసేపు నానబెడతారు. కానీ ఇది తప్పు. మష్రూమ్స్ స్పాంజ్ లాంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. నీటిలో ఎక్కువసేపు ఉంచితే అవి నీటిని పీల్చుకుని మెత్తబడి, వండేటప్పుడు రుచిని కోల్పోతాయి. అందుకే వండే కొద్ది నిమిషాల ముందు మాత్రమే వాటిపై ఉన్న మట్టి పోయేలా తేలికగా కడిగి, వెంటనే పొడి గుడ్డతో లేదా టిష్యూ పేపర్తో తుడవాలి.

మైదా పిండితో తేలికగా శుభ్రం చేసే ట్రిక్: మష్రూమ్స్పై ఉన్న నల్లటి మట్టి పొరను తేలికగా తొలగించడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. మైదా పిండి లేదా గోధుమ పిండి చల్లాలి. చేతితో మెల్లగా రుద్దితే మష్రూమ్స్కు ఉన్న మురికి, మట్టి అంతా పిండితో పాటు తేలికగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక్కసారి మంచి నీళ్లతో కడిగి ఆరబెడితే మష్రూమ్స్ తెల్లగా, శుభ్రంగా మారతాయి.

ప్లాస్టిక్ కవర్లలో ఉంచకండి: మార్కెట్ నుంచి తెచ్చిన మష్రూమ్స్ను చాలామంది అలాగే ప్లాస్టిక్ కవర్తో ఫ్రిజ్లో పెట్టేస్తారు. దీనివల్ల ప్లాస్టిక్ లోపల తేమ పెరిగి మష్రూమ్స్ త్వరగా పాడవుతాయి. మష్రూమ్స్ను పేపర్ కవర్లో ఉంచి ఫ్రిజ్లో పెడితే, పేపర్ అదనపు తేమను పీల్చుకుని మష్రూమ్స్ చాలా రోజుల పాటు తాజాగా ఉండేలా చూస్తుంది. ఒకవేళ బాక్స్లో పెట్టాలనుకుంటే, అడుగున టిష్యూ పేపర్ వేసి, దానిపై మష్రూమ్స్ ఉంచి మూత పెట్టాలి.

మష్రూమ్స్ వండేటప్పుడు ముందుగానే ఉప్పు వేస్తే వాటిలో ఉన్న నీరంతా బయటకు వచ్చి కూర నీళ్లలా మారిపోతుంది. అందుకే మష్రూమ్స్ కాస్త వేగిన తర్వాత, చివర్లో ఉప్పు వేసుకోవడం మంచిది. పోషకాలు పుష్కలంగా ఉండే మష్రూమ్స్ను సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని వండుకుంటేనే వాటి అసలైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మష్రూమ్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండటమే కాకుండా మీ వంటకాల రుచి కూడా రెట్టింపు అవుతుంది.