పుదుచ్చేరి పాలిటిక్స్: మరో ఎమ్మెల్యే ఔట్, రేపే పరీక్ష, అసెంబ్లీలో బలాబలాలేంటి..? నంబర్‌ గేమ్‌లో గెలిచేదెవరు?

|

Feb 21, 2021 | 3:25 PM

పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. రేపు సాయంత్రం అసెంబ్లీలో..

పుదుచ్చేరి పాలిటిక్స్: మరో ఎమ్మెల్యే ఔట్, రేపే పరీక్ష, అసెంబ్లీలో బలాబలాలేంటి..?  నంబర్‌ గేమ్‌లో గెలిచేదెవరు?
Follow us on

పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. రేపు సాయంత్రం అసెంబ్లీలో నారాయణస్వామి సర్కార్‌ విశ్వాసపరీక్ష జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌గా చెప్పుకోవాలి. అసెంబ్లీలో కూటమి బలం 13కు పడిపోగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పడిపోయింది. అయితే, బలపరీక్షలో నారాయణస్వామి సర్కార్‌ గట్టెక్కే అవకాశాలు తక్కువే అని చెప్పుకోవాలి. అసలు పుదుచ్చేరి అసెంబ్లీలో బలాబలాలేంటి..? మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకునేదెవరు..? నంబర్‌ గేమ్‌లో గెలిచేదెవరు అన్నది ఉత్కంఠ రేపుతోంది.

పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలుండగా కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థితో కూడిన 18 మంది సభ్యుల బలంతో..సీఎం నారాయణస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యేలు తీపాయన్, మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ , లక్ష్మినారాయణ్‌ రాజీనామా చేశారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అంతేగాక, గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ధనవేలుపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంతో ఆయన ఓటు కూడా చెల్లకుండా పోయింది. ప్రస్తుతం స్పీకర్‌తో కలిపి కాంగ్రెస్ పార్టీకి 9 మంది సభ్యుల బలం ఉండగా..డీఎంకేకు చెందిన ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. మరోవైపు ఎన్నార్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, బీజేపీకి చెందిన ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో కలిపి 14కు చేరింది కమలదళం బలం.

ఐతే నామినేటెడ్‌ సభ్యుల ఓటింగ్‌పై సీఎం నారాయణస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లుండి ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. మరోవైపు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని..నామినేటెడ్‌ సభ్యులు ఓటింగ్‌కు రాకుంటే తమదే విజయమంటున్నారు నారాయణస్వామి. ఇక పుదుచ్చేరిలో అధికారం చేపట్టాలంటే 15 మంది సభ్యుల బలం ఉండాలి. ఎవరూ సరైన బలం నిరూపించుకోకపోతే గవర్నర్ పాలనలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే బీజేపీనే తమ ప్రభుత్వంపై కుట్ర పన్ని ఇలా చేస్తోందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు

Read also :

పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్‌రావు దంపతుల హత్య, ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్న వివాదాలు

చినికిచినికి గాలివాన : పోడు భూములలో కందకం తీస్తే ఖబర్దార్, తెలంగాణలో ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ వర్సెస్‌ పొలిటికల్ లీడర్స్‌