Himachal Pradesh CM: హిమాచల్ తదుపరి సీఏం ఎవరు.. పోటీలో ఈ ముగ్గురు.. ఎక్కువ ఛాన్స్ వారికేనంట..?

|

Dec 09, 2022 | 3:00 AM

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెల్చుకోవడంతో ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంతో మంది ఆశావహులు పోటీలో ఉన్నప్పటికి.. ఇద్దరు అభ్యర్థులు పోటీచేసిన శాసనసభా స్థానాల్లో..

Himachal Pradesh CM: హిమాచల్ తదుపరి సీఏం ఎవరు.. పోటీలో ఈ ముగ్గురు.. ఎక్కువ ఛాన్స్ వారికేనంట..?
Agnihotri, Pratibha Singh, Sukhwinder Singh Sukhu
Follow us on

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెల్చుకోవడంతో ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంతో మంది ఆశావహులు పోటీలో ఉన్నప్పటికి.. ఇద్దరు అభ్యర్థులు పోటీచేసిన శాసనసభా స్థానాల్లో ఓడిపోవడంతో ప్రముఖంగా ముగ్గురు అభ్యర్థులు సీఏం పీఠం కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థుల కోసం పోటీ ఎక్కువుగానే ఉంటుంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లోనై ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఎనిమిది మంది సీఏం పదవికోసం పోటీపడుతున్నారంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌ షా వ్యంగంగా వ్యాఖ్యానించారు. ప్రతిస్పందనగా కాంగ్రెస్ నేత సుధీర్ శర్మ కౌంటరిస్తూ.. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని, ఎవరైనా సీఎం కావాలని కలలు కనే పార్టీ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం హిమాచల్‌లో అరడజనుకు పైగా అభ్యర్థులు సీఏం పీఠం కోసం పోటీ పడినప్పటికి.. కొతమంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయారు. దీంతో ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు సీఏం పీఠం కోసం పోటీపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌ సీఏం రేసులో సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, లోక్‌సభ సభ్యురాలు ప్రతిభా వీరభద్ర సింగ్ ముందువరుసలో ఉన్నారు. ఆశాకుమారి, కౌల్ సింగ్ ఠాకూర్ కూడా సీఏం పదవికి పోటీలో ఉన్నప్పటికి వారిద్దరు తమ నియోజకవర్గాల్లో విజయం సాధించలేకపోయారు. డల్హౌసీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆశా కుమారి ఈసారి ఓటమిని చవిచూశారు. మండిలోని దారంగ్ నియోజకవర్గం నుంచి కౌల్‌ సింగ్ ఠాకూర్ ఇదే స్థానంలో బీజేపీ అభ్యర్థి పూరన్ చంద్‌ చేతిలో ఓడిపోయారు.

హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ప్రచార కమిటీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖు నదౌన్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన సీఏం పదవికి బలమైన పోటీదారుగా ఉన్నారు. అయితే సీఏం అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు సుఖ్వీందర్ సింగ్‌ సుఖు. ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉన్న అగ్నిహోత్రి నైరుతి హిమాచల్‌లోని హరోలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. అగ్నిహోత్రి కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్నారు.

ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్‌ పిసిసి చీఫ్, మాజీ సిఎం వీరభద్ర సింగ్ భార్య, ప్రతిభా వీరభద్రసింగ్ కూడా సీఏం పీఠం కోసం పోటీపడుతున్నారు. హిమాచల్‌లోని మండి నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2017 వరకు హిమాచల్ సీఏంగా వీరభద్రసింగ్ పనిచేశారు. ప్రస్తుతం ప్రతిభా సింగ్‌ కూడా ముఖ్యమంత్రి పదవికోసం పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఈరోజు, రేపట్లో రోజుల్లో తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..