Watch: బస్సు డ్రైవర్‌ ఇంట్లో.. కుప్పలుగా కోట్లాది నోట్ల కట్టలు.. 15 కిలోల బంగారం!

ఓ బస్సు డ్రైవర్ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. సుమారు రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాయి వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక అవకతవకల దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. నగదును లెక్కించేందుకు పోలీసులు ఐదు క్యాష్ కౌంటింగ్ మెషీన్లు, భద్రపరిచేందుకు ఐదు ఇనుప ట్రంకులను తీసుకొచ్చినట్లు తెలిపారు..

Watch: బస్సు డ్రైవర్‌ ఇంట్లో.. కుప్పలుగా కోట్లాది నోట్ల కట్టలు.. 15 కిలోల బంగారం!
Raid On Former Bus Driver House

Updated on: Jul 29, 2026 | 7:01 PM

పశ్చిమ బెంగాల్‌, జులై 29: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. ఓ మాజీ ప్రభుత్వ బస్‌ డ్రైవర్‌ ఇంట్లో ఏకంగా రూ.20 కోట్ల నగదు, సుమారు 15 కిలోల బంగారు బిస్కెట్లు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సోదాలు మంగళవారం (జులై 28) రాత్రి దేచా ప్రాంతంలో జరిగాయి. రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు మాజీ బస్‌ డ్రైవర్‌ మినార్‌ మొండల్‌ ఇంటిపై దాడి చేశారు. ఆయన ప్రముఖ రాయి వ్యాపారి తులు మొండల్‌కు బావమరిది అని పోలీసులు తెలిపారు. ఇంట్లో లభించిన భారీ మొత్తంలో నగదును లెక్కించేందుకు ప్రత్యేకంగా ఐదు క్యాష్‌ కౌంటింగ్‌ మెషీన్లు తీసుకువచ్చారు. అలాగే నగదును భద్రపరిచేందుకు ఐదు పెద్ద ఇనుప ట్రంక్‌లు ఉపయోగించారు.

సుమారు 35 సంచుల్లో నగదు ఉన్నట్లు గుర్తించామని, నగదు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాయి పరిశ్రమకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తులు మొండల్‌కు చెందిన సంస్థ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఉన్న ఆరు రాయి పరిశ్రమ క్లస్టర్ల ప్రవేశ ద్వారాల వద్ద ఆదాయం వసూలు చేసే బాధ్యత నిర్వహించిందని అధికారులు తెలిపారు. ప్రతి నెల సుమారు రూ.83 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ప్రభుత్వ ఖజానాలో కేవలం రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు మాత్రమే జమ అయ్యాయని, మిగిలిన మొత్తం దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ దాడులపై పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందించారు. అక్రమంగా సంపాదించిన భారీ మొత్తంలో ఆస్తులు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్ పాలసీ’తో ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజా వనరులను దుర్వినియోగం చేసి సంపద కూడబెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన అన్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏమిటి? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us