
దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఉపాధి రంగాలను సమూలంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA – 2005) నేటితో (జూలై 1) పూర్తిగా రద్దయింది. దీని స్థానంలో “వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)” VB-G RAM G చట్టం నేటి నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు కానుంది.
గతంలో ఉపాధి హామీ కింద 100 రోజుల పని దినాలు కల్పించగా, ఈ నూతన చట్టం ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏకంగా 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీ లభించనుంది. కేవలం శారీరక శ్రమతో కూడిన ఉపాధి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ఆదాయం, నీటి వనరుల సంరక్షణ, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) నాణ్యమైన అభివృద్ధిపై ఈ చట్టం ప్రత్యేక దృష్టి సారిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను భరించనున్నాయి.
రేపు తిరుపతిలో ప్రారంభోత్సవం
ఈ నూతన చట్టం జాతీయ స్థాయి అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం (జూలై 2) ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఏపీలో ఈ చట్టాన్ని తక్షణమే, సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో సందిగ్ధత.. !
మరోవైపు, ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనే అంశంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధుల వాటా భరించాల్సి ఉండటంతో, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, గురువారం భేటీ కానున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ VB-G RAM G చట్టం అమలుపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనుంది.
ఏదేమైనప్పటికీ, ఈ నూతన చట్టం గ్రామీణ భారతదేశాన్ని మరింత శక్తివంతం చేసి, ‘వికసిత్ భారత్’ సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్రం ధీమా వ్యక్తం చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..