నాన్న రమ్మన్నాడని పరుగు పరుగున వెళ్లాడు.. తండ్రే కాలయముడు అవుతాడనుకోలేదు పాపం..!
ఆస్తిపై వ్యామోహం మనుషులను ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒక తండ్రి, ఆస్తి తగాదాల్లో తన కుటుంబ సభ్యులను ఇరికించాలనే దుర్బుద్ధితో తన 13 ఏళ్ల ఏకైక కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు మిస్టరీ వీడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆస్తిపై వ్యామోహం మనుషులను ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒక తండ్రి, ఆస్తి తగాదాల్లో తన కుటుంబ సభ్యులను ఇరికించాలనే దుర్బుద్ధితో తన 13 ఏళ్ల ఏకైక కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు మిస్టరీ వీడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
సిర్సా గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి తన కుటుంబ సభ్యులతో కొంతకాలంగా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. వారిని ఎలాగైనా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా, గురువారం (మే 07) తన కుమారుడు అదృశ్యమయ్యాడని కాస్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, బాలుడు చివరిసారిగా తండ్రితో కలిసి కారులో వెళ్లినట్లు తేలింది. అనుమానం వచ్చిన పోలీసులు తండ్రిని విచారించగా, అతను పొంతన లేని సమాధానాలు చెబుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, సాంకేతిక దర్యాప్తు ముందు అతని అబద్ధాలు నిలవలేదు. అదే సమయంలో, సిర్సా గ్రామంలోని ఒక చెరువులో బాలుడి మృతదేహం లభ్యమైంది.
పోలీసుల విచారణలో నిందితుడు అసలు నిజం ఒప్పుకున్నాడు. తన కుటుంబ సభ్యులపై నింద మోపడానికి, తానే స్వయంగా కొడుకును గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు అంగీకరించాడు. నిజాన్ని జీర్ణించుకోలేక, పట్టుబడతాననే భయంతో, నిందితుడు అరెస్టుకు ముందు నడిరోడ్డుపై బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాగా, “నిందితుడు పక్కా ప్రణాళికతో తన కొడుకును చంపి, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశాం, తదుపరి విచారణ కొనసాగుతోంది” అని గ్రేటర్ నోయిడా డీసీపీ డాక్టర్ ప్రవీణ్ రంజన్ తెలిపారు. తమ కళ్లముందే పెరిగిన 13 ఏళ్ల బాలుడు, కన్నతండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో సిర్సా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్తి కోసం కన్నప్రేమను మరిచిన ఆ తండ్రి తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
