
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం (జూన్ 22) చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానియా ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి, పై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కొద్ది నిమిషాల్లోనే భవనం మొత్తం పొగ, మంటలతో నిండిపోయింది. కోచింగ్ సెంటర్లో తరగతులు జరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు బాల్కనీలు, పైకప్పుల నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. సంఘటనా స్థలంలో కేకలు, అరుపులతో భయానక వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలకు దిగారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించి, పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం అగ్నిమాపక దళం, పోలీసులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు గంటలపాటు శ్రమించారు. లక్నో జిల్లా మేజిస్ట్రేట్ విశాఖ్ జి. అయ్యర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మృతదేహాల గుర్తింపు, గాయపడిన వారి చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, డీజీ ఫైర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక లోపాల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..