ఉప్పు నిప్పులా భారత్-పాక్ లు…దాయాదుల మధ్య సయోధ్యకు ఆ దేశం యత్నం!

|

Apr 16, 2021 | 3:07 PM

India - Pakistan Relations: దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్ మధ్య సయోధ్యకు ఆ దేశం విశ్వ ప్రయత్నం చేస్తోంది. అసలు ఎందుకు ఆ దేశం ఆ పని చేస్తోంది..దాయాది దేశాల మధ్య సత్సంబంధాలతో ఆ దేశానికి ఒరిగేదేంటి..?

ఉప్పు నిప్పులా భారత్-పాక్ లు...దాయాదుల మధ్య సయోధ్యకు ఆ దేశం యత్నం!
India Pakistan UAE
Follow us on

దాయాది దేశాలైనా… ఉప్పు. నిప్పుగా ఉంటాయి భారత్, పాకిస్థాన్ లు. ఎక్కడా తగ్గేది లే అనే తీరు ఉంటోంది. పాక్ తో ఎప్పుడు యుద్ధం వచ్చినా భారత్ దే పై చేయి. కింద పడ్డా పై చేయి మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్న పాక్ తీరును భారత్ ఇంటా బయటా ఖండిస్తూనే ఉంది. అంతర్జాతీయ వేదికల పై ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తోంది. పాక్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఈ విషయంలో పొరుగు దేశాలు చాలా సలహాలు, సూచనలు ఇచ్చినా భారత్ పెద్దగా పట్టించుకోలేదు. మా దేశ అంతర్గత వ్యవహారంలో ఇతరుల జోక్యం సహించేది లేదని తేటతెల్లం చేసింది. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ వంటి దేశాలకు అదే చెప్పింది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సయోధ్యకు యూఏఈ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అసలు ఎందుకు అరబ్ దేశం ఆ పని చేస్తోంది..ఏంటనేది చూద్దాం…

ధీటుగానే….
2019లో పుల్వామాలో భారత దళాలపై ఉగ్రదాడి చేసింది పాక్. ఆ దాడిని ధీటుగా తిప్పికొట్టింది ఇండియా. అంతే కాదు..శత్రువులను తరుముకుంటూ వెళ్లిన వింగ్ కమాండర్ అభినందన్ ను తిరిగి రప్పించుకుంది. ఈ దాడి వెనుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం బయటపడింది. అందుకే మోదీ సర్కార్ యుద్ధవిమానాలను రంగంలోకి దింపి..ఉగ్ర శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది. పాక్ ప్రభుత్వానికి తెలియకుండా ఆ దేశానికి వెళ్లి మరీ ఉగ్రవాదుల పై దాడి చేయడం మాములు విషయం కాదు. ఆ తరువాత భారత్-పాక్ దౌత్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో భారత ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇది సహజంగానే పాక్ కు కోపం తెప్పించే ఘటన. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక భారత్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా నిలిపేసింది. భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ఏడాది జనవరిలో రహస్యంగా సమావేశమైనట్టు సమాచారం.

India Vs Pakistan

తెరవెనుక అరబ్ దేశం…
ఇటు పాక్, అటు భారత్ లో కాకుండా యూఏఈలో ఈ చర్చలు జరిగాయి. ఇందుకు కొన్ని నెలలుగా యూఏఈ మధ్యవర్తిత్వం వహిస్తుంది. ముందుగా ఇరుదేశాల రాయబారులను నియమించారు. ఆ తర్వాత కశ్మీర్‌ అంశం పైనా శాశ్వత నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందుకు బలం చేకూరుస్తున్నట్లుగా శాంతి ప్రకటన చేశాయి రెండు దేశాలు. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌ దీని వెనుక ఉన్నారని అంతా భావించారు. కానీ ఇరు దేశాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించింది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అని తెలుస్తోంది. భారత్, పాక్ దేశాల డైరెక్టర్‌ జనరల్స్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవోలు) సంయుక్త ప్రకటన చేశాయి. అరబ్ కంట్రీ ప్రోద్భలంతోనే ఇదంతా జరిగింది. అలానే ఫిబ్రవరి 26న యూఏఈ విదేశాంగ మంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయేద్‌ ఢిల్లీకి వచ్చి మరీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిశారు.

ఇరు దేశాల శాంతి ప్రకటన రావడానికి కొన్ని నెలల ముందు నుంచే యూఏఈ మధ్యవర్తిత్వం చేసింది. భారత్‌, పాకిస్థాన్‌ ల మధ్య శాంతి దిశగా సిద్ధం చేసిన రోడ్‌మ్యా్‌ప్ ఇది తొలి అడుగే. ఇంకా చాలా అడుగులు వడి వడిగా పడాల్సి ఉంది.

భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు తమ రాయబారులను పరస్పరం పొరుగుదేశాల్లో నియమించనున్నాయి. ఆర్టికల్‌ 371ని భారత్ రద్దు చేసినప్పుడు 2019లో పాకిస్థాన్‌ తన దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. న్యూఢిల్లీలో ఉన్న తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. అప్పట్నుంచీ ఇరు దేశాల్లో పరస్పర రాయబారులు లేరు. ఇరు దేశాల నడుమ వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ దిశగా చర్చలు జరగనున్నాయి. అంతే కాదు కశ్మీర్‌పై శాశ్వత నిర్ణయం దిశగా చర్చలు జరిగితే పొరుగు దేశాల మధ్య శాంతి పరిఢవిల్తుతుంది.

ప్రతీకాత్మక చిత్రం

చాలా కాలం నుంచే…
భారత్‌-పాక్‌ నడుమ శాంతిసాధనలో యూఏఈ పాత్ర రెండేళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. 2020 నవంబరులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అబుధాబీకి వెళ్లారు. యూఏఈ కింగ్‌ జాయెద్‌ బిన్‌ అబ్దుల్లాతో చాలా ప్రశాంతంగా మాట్లాడారు. చర్చలు సానుకూలంగా జరిగాయి. 2020 డిసెంబర్ లో పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి ను తన వద్దకు రప్పించుకున్నారు యుఏఏ రాజు జాయేద్‌. వారి మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. భారత్ తో పోరు కంటే చెలిమి ముఖ్యమని రాజు జాయెద్ పాక్ కు విడమరిచి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. శాంతితో ముందుకు వెళతామని ఫిబ్రవరి 25న ప్రకటన విడుదల చేశాయి. దాని కన్నా కొద్ది రోజులు ముందు భారత గగనతలం మీదుగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విమానం వెళ్లింది. ఆయన శ్రీలంక పర్యటనకు వెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. 2019 తర్వాత పాక్‌ విమానం భారత గగనతలం మీదుగా ఎగరడం అదే తొలిసారి. కరోనా బారిన పడిన ఇమ్రాన్‌ ఖాన్‌ త్వరగా కోలుకోవాలని మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా దాయాది దేశాల నడుమ సంబంధాల సరళి సానుకూలంగా మారుతోంది. పాక్, భారత్ లు కలిసుంటే తమ వర్తక, వాణిజ్యానికి ఇబ్బంది లేదని యూఏఈ భావిస్తోంది. అందుకే వీలున్నంత తక్కువ సమయంలో సయోద్యకు పావులు కదుపుతోంది.

ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దేందుకు తెరవెనుక చర్చలు జరుపుతున్నాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన అధికారులు, భారత నిఘా సంస్థ ‘రా’ అధికారులు ఇటీవల దుబాయ్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశం ఏర్పాటు వెనుకు యూఏఈ ప్రభుత్వం కృషి ఉందని సమాచారం. దీని పై ఇంత వరకు భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అదే సమయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.

భారత్, పాక్ ఉన్నతాధికారులు ఇప్పుడు వివిధ దేశాల్లో రహస్యంగా సమావేశమవుతున్నారు. పలు అంశాల పై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారని పాక్ రక్షణ రంగ విశ్లేషకురాలు అయోషా సిద్దీకా తెలిపారు. ‘ఇరు దేశాల ఉన్నతాధికారులు థాయ్‌ల్యాండ్, లండన్, దుబాయ్‌లలో సమావేశమయ్యారని ఆమె చెతున్న తీరు ఇందుకు బలం చేకూరుస్తోంది. ఈ చర్చలు ఎంత వరకు వచ్చాయి. ఏంటనేది బయటకు రాలేదు. ఇవేమీ శాంతిచర్చలు కావు. కానీ సంబంధాలు మరింతగా దిగజారకుండా ఇరుదేశాల అధికారులు మాట్లాడుతున్నారని చెబుతున్నారు మరికొందరు రక్షణ రంగ విశ్లేషకులు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ(File Photo)

చర్చలెందుకంటే…
చైనాతో భారత్‌కు పొసగడం లేదు. సరిహద్దు వివాదాలున్నాయి. అంతే కాదు అమెరికాతో భారత్ దగ్గరగా ఉందనే వాదన చేస్తోంది చైనా. అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెతను గుర్తు చేసుకుంటోంది. భారత్ కు శత్రువైన పాక్ ను దగ్గరకు తీస్తోంది. యుద్ధ సామగ్రిని అందిస్తోంది. ఇలాంటి సమయంలో పాక్ ను మరింతగా వదిలిపెడితే చైనా దగ్గరకు తీసి మనకు వ్యతిరేకంగా ఉలికొల్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సరిహద్దులో అప్రకటిత కాల్పులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే ఉన్న ఏకైక మార్గం చర్చల పేరుతో ఉద్రిక్తలను తగ్గించడం. ప్రస్తుతం భారత్ చేస్తున్న పని ఇదేనంటున్నారు. పాక్‌తో నెలకొన్న వివాదం సుదీర్ఘకాలం పాటు కొనసాగడం భారత్‌కు సుతారం ఇష్టంలేదు. భారత్ తో వాణిజ్యం సంబంధాలు తెంచుకోవడం వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి పాక్ ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి సమయంలో భారత్‌తో వివాదం అదుపుతప్పకుండా ఉండేందుకు మరోవైపు పాక్ ప్రయత్నిస్తోంది.

యుద్ధం వద్దని…
ఇప్పుడు అప్ఘానిస్థాన్ నుంచి అమెరికా తన సేనలు ఉపసంహరించుకుంటోంది. ఇది పాక్ కు ఇబ్బంది తెచ్చే అంశమే. అప్ఘాన్-పాక్ సరిహద్దు వద్ద పరిస్థితులను అదుపులో ఉంచేందుకు పాక్ నానా తంటాలు పడుతోంది. అందుకే ఇరు దేశాలు తమ మధ్య నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ఆలోచన చేస్తోంది. భారత్, పాకిస్థాన్ సంబంధాలపై అమెరికా నిఘా విభాగం దృష్టి పెట్టింది. గతంలో కంటే భారత్ వైఖరిలో మార్పు వచ్చిందని, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సైనిక చర్యకు మొగ్గు చూపుతోందని తమ వార్షిక నివేదికలో నిఘా విభాగం స్పష్టం చేసింది. పాకిస్థాన్‌ రెచ్చిపోతే భారత్‌ సైనిక చర్య ద్వారానే ఆ దేశానికి బుద్ధి చెబుతుందని కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో తెలిపింది. భారత్, పాక్‌ల మధ్య సాధారణ యుద్ధం జరిగే అవకాశం లేదు. అయినా రెండింటి మధ్య ఉద్దేశపూర్వక సంక్షోభం తీవ్రతరం అయ్యే అవకాశం లేకపోలేదని అమెరికా అభిప్రాయం.

చర్చలు, దౌత్యమార్గాల కంటే సైనిక చర్యకే మొగ్గు చూపుతోంది భారత్. కశ్మీర్లో అశాంతి వల్ల గానీ, ఏదేనా ఉగ్రదాడి వల్ల గానీ రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి ఘర్షణకు దారితీసే అవకాశముందనేది అమెరికా వాదన. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను 2019 ఆగస్టులో రద్దుచేసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఉగ్రవాదం, చొరబాట్లు, హింసలేని వాతావరణంలో పాకిస్థాన్‌తో సాధారణ పొరుగు దేశంలా సంబంధాలు కోరుకుంటుంది భారత్. అటువంటి వాతావరణాన్ని సృష్టించే బాధ్యత దాయాదిపై ఉందని భారత్ అంటోంది.

అంతటా..హింసా వాతావరణమే…
అఫ్గనిస్థాన్, ఇరాక్, సిరియాలో పోరాటం అమెరికా సేనలపై ప్రభావం చూపుతోంది. భారత్, పాక్‌ల మధ్య ఘర్షణలు జరిగితే మొత్తం ప్రపంచం ఆందోళన వ్యక్తమయ్యే వీలుంది. ఇప్పటికే ఇజ్రాయేల్- ఇరాన్ మధ్య హింస, ఇరాక్ లో అంతర్గత యుద్ధం, లిబియాలో విదేశీ శక్తుల ఆగడాలు, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంతో సహా ఇతర ప్రాంతాలలో హింస జరుగుతోంది. ఆఫ్గాన్‌లో శాంతి చర్చల ప్రక్రియ ఇప్పట్లో ముందుకు సాగే అవకాశం లేదు. ఆప్థాన్ పోరులో తాలిబన్లు ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తాయి. ఒకవేళ సంకీర్ణ దళాలను పూర్తిగా ఉపసంహరిస్తే అఫ్గన్ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కోవడం ఖాయం. యుద్ధంలో అఫ్గనిస్థాన్ ప్రభుత్వం ఎదురుదెబ్బలు తింటే అందరికీ ఇబ్బందినే. అందుకే చేయి దాటక ముందే శాంతి చర్చలు ఇరుదేశాలు జరుపుతున్నాయి. కానీ పైకి చెప్పడం లేదు. ఇలాంటి చర్చలు ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు..ఇరుదేశాల మధ్య మంచి సుహృద్భావ వాతావరణాన్ని తీసుకువస్తాయి.