Jammu Floods: జమ్మూ కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. విరిగిపడిన కొండచరియలు.. ముగ్గురు మృతి.. ఇళ్లు, రోడ్లు ధ్వంసం

Jammu Floods: రాంబన్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం పట్ల జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వం తక్షణ రక్షణ, సహాయ చర్యలను..

Jammu Floods: జమ్మూ కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. విరిగిపడిన కొండచరియలు.. ముగ్గురు మృతి.. ఇళ్లు, రోడ్లు ధ్వంసం

Updated on: Apr 20, 2025 | 3:09 PM

జమ్ము కశ్మర్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు పోటెత్తిపోతున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని చీనాబ్ నదికి సమీపంలోని ధరంకుండ్ గ్రామంలో రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడటం, వడగళ్ల వానలు, తీవ్రమైన గాలులతో కూడిన ప్రకృతి వైపరీత్యం ఆస్తి, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. డజన్ల కొద్దీ కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. అనేక చోట్ల జాతీయ రహదారిని దిగ్బంధించింది.

స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సమీపంలోని నల్లాలో నీటి మట్టం పెరిగి, చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని ముంచెత్తిన వరదగా మారింది. పది ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 25 నుండి 30 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

సహాయక చర్యలు ముమ్మరం:

అయితే భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో పోలీసులు, సహాయక సిబ్బంది రంగంలోకి దిగాయి. విధ్వంసం జరిగినప్పటికీ, ధరమ్‌కుండ్ పోలీసులు, జిల్లా యంత్రాంగం త్వరితగతిన స్పందించడంతో ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్న దాదాపు 90 నుండి 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇల్లు కూలి ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు మృతి:

అలాగే ఈ భారీ వర్షాల కారణంగా బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను బాగ్నా పంచాయతీ నివాసితులు మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75)గా గుర్తించారు. ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సింగ్ తెలిపారు.

జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, చాలా నివాస గహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బురదతో నిండిన నీరు ఇళ్ళు, కూలిపోయిన నిర్మాణాలు, శిథిలాల కింద చిక్కుకున్న వాహనాలు దృశ్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి. నీటి మట్టాలు పెరుగుతూనే ఉండటంతో మహిళలు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడాన్ని రెస్క్యూ విజువల్స్ చూపించాయి.

ప్రాణ, ఆస్తి నష్టం బాధాకరం: ముఖ్యమంత్రి

రాంబన్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం పట్ల జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వం తక్షణ రక్షణ, సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని సహాయక బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు చెప్పారు. వర్షాలు, వరదలను తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పునరావాస చర్యలను సమీక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు.

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పరిస్థితి తీవ్రతను గుర్తించి జిల్లా యంత్రాంగం తీసుకున్న సత్వర చర్యలను ప్రశంసించారు. రాంబన్ ప్రాంతంలో రాత్రంతా భారీ వడగళ్ల వాన, అనేక కొండచరియలు విరిగిపడటం, వేగంగా గాలులు వీచాయి. జాతీయ రహదారి దిగ్బంధంలో ఉన్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు ముగ్గురు ప్రాణనష్టం, అనేక కుటుంబాలకు ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు డిప్యూటీ కమిషనర్ బసీర్-ఉల్-హక్ చౌదరితో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, ఆర్థిక సహాయం, ఇతర సహాయాన్ని అందిస్తున్నట్లు హామీ ఇచ్చానని సింగ్ అన్నారు. అవసరమైతే నా వ్యక్తిగత నిధుల నుండి ఇంకా ఏమైనా అవసరమైతే అందిస్తానని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. ఇదిలా ఉండగా, కొండచరియలు విరిగిపడటం, రాళ్ల కాల్పుల కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి ఐదు చోట్ల నిలిచిపోయిందని ట్రాఫిక్ జాతీయ రహదారి (రాంబన్) ఎస్ఎస్పీ రాజా ఆదిల్ హమీద్ గనై తెలిపారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత రహదారులు క్లియర్‌ అవుతాయని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us