
పెరిగిపోతున్న సాంకేతికత కారణంగా సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఎక్కడికైనా వెళ్లాలంటే రోడ్డు వరకు వెళ్లి అక్కడ వచ్చే వాహనాలను ఆపి వెళ్లేవాళ్లం. కానీ ప్రస్తుతం టెక్నాలజీ సాయంతో ఒక్క క్లిక్ తోనే కావలసిన వెహికిల్ మన వద్దకు వచ్చేస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఈ తరహా విధానం శర వేగంగా పుంజుకుంటోంది. ప్రజల అవసరాలు తెలుసుకుని ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. ప్రయాణీకులను సకాలంలో గమ్య స్థానాలకు చేర్చడం వీటి పని. అయితే.. ఎయిర్ పోర్టుకు లేట్ గా తీసుకెళ్లినందుకు మహిళా ప్రయాణీకురాలికి రూ.20,000 జరిమానా చెల్లించాలని మహారాష్ట్రలోని ముంబాయి జిల్లా వినియోగదారుల కోర్టు ఉబర్ ఇండియాను ఆదేశించింది. సేవల్లో లోపానికి ఆ సంస్థను దోషిగా నిర్ధారించిన కోర్టు.. ప్రయాణికురాలి మానసిక వేదనకు రూ. 10వేలు, అదనంగా అయిన ఖర్చుకు రూ. 10వేలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది.
కవితా శర్మ అనే లాయర్.. 2018 జూన్ 12న సాయంత్రం చెన్నైకి వెళ్లాల్సి ఉంది. విమానంలో వెళ్లేందుకు టికెట్లు తీసుకున్నారు. తన నివాసానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయానికి వెళ్లేందుకు మధ్యాహ్నం 3.29 గంటలకు ఉబర్ క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. దీంతో ఆ కారు 14 నిమిషాల తరువాత ఆమె ఇంటి వద్దకు వచ్చింది. అయితే కారు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతుండటాన్ని కవితా శర్మ గుర్తించారు. ఫోన్ మాట్లాడటం ఆపేసి ప్రయాణం సాగించాలని కోరారు. అయినా అతను వినకుండా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడటం అయిపోయిన తర్వాత తీరిగ్గా బండి స్టార్ట్ చేశాడు. తరువాత డ్రైవర్ సీఎన్జీ స్టేషన్ కు రాంగ్ టర్న్ తీసుకొని 15-20 నిమిషాలు వృథా చేశాడు. చివరికి ఎయిర్ పోర్టుకు చేరుకునే సరికి సాయంత్రం 5.23 అయ్యింది. దీంతో ఆమె ఫ్లైట్ మిస్ అయ్యింది. మళ్లీ ఆమె తన సొంత ఖర్చుతో మరో విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది.
క్యా బ్ బుక్ చేసిన సమయంలో పేమెంట్ రూ.563 అవుతుందని ఉబర్ పేర్కొంది. కానీ ఎయిర్ పోర్టులో దిగిన తరువాత రూ. 703 అని చూపించింది. దీంతో అడిగినంత మొత్తాన్ని ఆమె డ్రైవర్ చెల్లించింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అనైతిక ప్రవర్తన కారణంగా ఆమె తన విమానాన్ని కోల్పోయానని పేర్కొంటూ ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉబర్ ఆమెకు రూ.139 రీఫండ్ చేసింది. ఈ విషయాన్ని బాధితురాలు థానే అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో ఫిర్యాదు చేశారు. పలు దఫాల చర్చల తరువాత చివరికి ఉబర్ ఆ మహిళా ప్రయాణికురాలికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..