
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో అడుగుపెట్టేందుకు అంతా రెడీ అయిపోయింది. టెస్లా తొలి షోరూమ్ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముస్తాబవుతోంది. ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో నాలుగు వేల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్కుగాను కంపెనీ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్కో ప్రాపర్టీస్ నుంచి లీజు అగ్రిమెంట్స్ కూడా పూర్తయింది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ కూడా టెస్లా అధినేత మస్క్ చెల్లించినట్లు తెలుస్తోంది.
టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా చెబుతూ వస్తోంది. అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సమయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో సమావేశం అయ్యారు. భారత్లో టెస్లా ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను ఇరువురూ చర్చించారు. మోదీతో భేటీ అయిన కొద్ది రోజుల్లోనే ముంబైలో టెస్లా రిక్రూట్మెంట్స్ సహా కంపెనీ ప్రారంభానికి గల చర్యలను వేగంగా ప్రారంభించింది.
భారత్లో తొలతు రెండు రెండు షోరూమ్లను ఏర్పాటు చేయాలని టెస్లా నిర్ణయించింది. ఆ మేరకు ఢిల్లీ, ముంబై నగరాలను సంస్థ ఎంపిక చేసింది. ఇటీవలే నియామకాల ప్రక్రియ కూడా చేపట్టింది. కస్టమర్ రిలేటెడ్, బ్యాక్ఎండ్ జాబ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ ప్రకటన ఇటీవలే జారీ చేసింది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, సలహదారు పోస్టులు వంటి వాటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. మిగిలిన పోస్టులకు ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు ప్రకటనలో తెలిపింది.