AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahal Issue: తాజ్‌ మహల్‌లోని ఆ 22 గదుల్లో ఏముంది?.. హాట్‌ టాపిక్‌గా మారిన పిటిషన్..!

Taj Mahal Issue: అలహాబాద్ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. భారతదేశానికి చిహ్నం,

Taj Mahal Issue: తాజ్‌ మహల్‌లోని ఆ 22 గదుల్లో ఏముంది?.. హాట్‌ టాపిక్‌గా మారిన పిటిషన్..!
Taj Mahal
Shiva Prajapati
|

Updated on: May 10, 2022 | 12:44 PM

Share

Taj Mahal Issue: అలహాబాద్ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. భారతదేశానికి చిహ్నం, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి విరాజిల్లుతున్న తాజ్ మహల్ గురించే ఈ పిటిషన్. అవును.. తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్‌ విషయంలో ఎనలేని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందులో హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు, మతపరమైన గ్రంధాలు ఉన్నాయనే అనుమానలు ఎప్పటినుంచో తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, తాజ్ మహల్ చరిత్రపై నిజనిర్ధారణ విచారణ చేపట్టాలని, తాజ్ మహల్‌లో ఇప్పటికీ రహస్యంగా ఉన్న 22 గదుల తలుపులు తెరిపించాలని అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ అయోధ్య విభాగానికి మీడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రజనీస్ సింగ్ ఈ అంశంపై లక్నో బెంచ్ రిజిస్ట్రీలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

రిజిస్ట్రీ ఆమోదిస్తే ఈ పిటిషన్ విచారణ కోసం కొర్టు ముందుకు వస్తుంది. ‘‘స్మారక చిహ్నమైన తాజ్ మహల్‌లోని 22 గదుల తలుపు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయి. వాటిని చూడటానికి అనుమతించాలని పిటిషన్‌లో కోర్టును కోరాను.’’ అని రజనీస్ సింగ్ చెప్పారు.

మొఘల్ సామ్రాజ్య కాలంలో నిర్మితమైన తాజ్‌మహల్‌ను భారత పురావస్తు ఖాఖ పరిరక్షిస్తోంది. కాగా, సింగ్ దాఖలు చేసిన పిల్‌లో పురాతన, చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవవేశాలు(జాతీయ ప్రాముఖ్యత ప్రకటన) చట్టం 1951, పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాలు చట్టం 1958లోని కొన్ని నిబంధనలను పక్కన పెట్టాలని కోరారు. చారిత్రక కట్టడాలైన మహల్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా కోట, ఇతిమద్-ఉద్-దౌలా సమాధికి సంబంధించి నిజనిర్ధాణ విచారణ జరిపించలని కోరారు.

ఇవి కూడా చదవండి

అయితే, తాజ్ మహల్‌కు సంబంధించి ఒక వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. తాజ్‌మహల్‌లోని దాదాపు 22 గదులకు తాళాలు వేసి, ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. దానికి కారణం ఆ గదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు, గ్రంధాలు ఉన్నాయని చాలా మంది విశ్వాసం. ఇదే అంశాన్ని రజనీష్ సింగ్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. తాజ్ మహల్ నాలుగు అంతస్థుల భవనంలో ఎగువ, దిగువ భాగంలో శాశ్వతంగా తాళం వేసిన 22 గదుల్లో శివాలయం ఉందని, ఆ విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తన పిటిసన్‌లో పేర్కొన్నారు.

అయితే, తాజ్ మహల్ అంశంపై దేశ వ్యాప్తంగా భిన్నవిధాలుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ప్రముఖ విశ్లేషకులు అశిష్ మెహత తన అభిప్రాయాన్ని, విశ్లేషణను వ్యక్తపరిచారు. ఆయన విశ్లేషణ ఇలా ఉంది.

ప్రపంచ దేశాల్లో భారత్ ప్రస్తావన వస్తే ముందుగా తాజ్ మహల్, మహాత్మా గాంధీ గుర్తుకు వస్తారు. అయితే, భారత్‌కు గర్వకారణమైన.. ఈ స్మారక చిహ్నం ఇప్పుడు మతపరమైన వివాద కేంద్రంగా మారడం బాధాకరం. దేశానికి గౌరవ చిహ్నంగా, గర్వానికి చిహ్నంగా ఉండాల్సిన స్మారకాన్ని వివాదం చేసి అబాసుపాలు చేయాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది తప్ప మరే ప్రయోజనమూ లేదు.

17వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ స్మారక చిహ్నాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది ప్రపంచంలోని 7 వింతల్లో తాజ్ మహల్ ఒకటిగా నిలిచింది. అలాంటి అందమైన వారసత్వం గురించి దేశం గర్వపడుతుంది. కానీ, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా నడుస్తోంది దేశం. ఇది ఇస్లామిక్ పాలన కాలానికి చెందిన వారసత్వం అని రైట్‌వింగ్‌లోని ఒక వర్గం దుష్ఫ్రచారం చేస్తోంది.

మిలియన్ల మంది భారతీయులతో సహా రికార్డు సంఖ్యలో పర్యాటకులు దీనిని ఆ విధంగా చూడలేదు. చక్రవర్తులు వచ్చారు, వెళ్లారు. కానీ, తాజ్ మహల్ నిలిచే ఉంది. ఈ అందమైన నిర్మాణం.. భారతీయుల కళాత్మకతను, నిర్మాణ నైపుణ్యాన్ని, హస్తకళాకారుల కృషిని ప్రతిబింబిస్తుంది. ఈ స్మారకం భారత గడ్డపై ఉన్న మహాద్భుతంది. దీన్ని కేవలం ఒక మతానికి పరిమితం చేసి, వివాదం చేయాలని భావిస్తున్నారు. దూరం నుంచి ఈ పాలరాతి అందాన్ని చూసినప్పుడు ప్రజల్లో కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. కానీ, ఇది ముస్లింలకు సంబంధించినదని కొద్ది మంది మాత్రమే భావిస్తారు. సైద్ధాంతిక భావాలు కలిగిన వారు ఎవరూ ఈ అందమైన అద్భుతాన్ని మతపరమైన కోణంలో చూడలేరు.

హిందూత్వ వాదుల ప్రయత్నాల్లో భాగంగా తాజాగా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు ఒక పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్ లోపల దాగి ఉన్న హిందూ విగ్రహాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి లోపల ఉన్న 20 గదులను తెరవాలని, ఈ మేరకు ఏఎస్ఐని ఆదేశించింది. ఈ వాదనలను గత ప్రభుత్వాలు కొట్టేశాయి. భద్రతా కారణాల నేపథ్యంలోనే ఆ గదులకు తాళం వేయడం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది.

తాజ్‌మహల్‌లో హిందూ దేవాలయాలు ఉన్నాయనే సిద్ధాంతం పిఎన్ ఓక్‌తో మొదలై ఉండవచ్చు. స్వయం ప్రకటిత చరిత్రకారుడైన.. ఓక్ తన పరిశీలనాత్మక పరిశోధనలో తాజ్ మహల్ ఓ శివాలయంపై నిర్మించబడిందని నిర్ధారించారు. (తాజ్ మహల్ మాత్రమే కాదు. వాటికల్ సిటీ, కాబా, వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే కింద కూడా తవ్వితే మీకు శివాలయం లభిస్తుందని అతను విశ్వసించాడు. అయితే, ఎవరూ తవ్వకాలు జరిపేందుకు అనుమించలేదు, ఈ సిద్ధాంతం నిరూపించబడలేదు.)

1966లో, పిఎన్ ఓక్.. ‘తాజ్ మహల్ ఒక రాజ్‌పుత్ ప్యాలెస్’ పేరుతో తన మొదటి కరపత్రాన్ని రూపొందించాడు. తదుపరి పరిశోధనతో సాయుధమయ్యాడు. వెంటనే మరొక బుక్‌లెట్‌ ప్రచురించాడు. దానికి శీర్షిక ‘ది తాజ్ మహల్ ఒక టెంపుల్ ప్యాలెస్’గా పెట్టాడు. (అతని ఇతర పుస్తకాలలో ‘ఆగ్రా ఎర్రకోట హిందూ భవనం’ – హిందూ రైట్‌వింగ్‌కు ఇంకా చాలా పని ఉంది.)

ఈ స్మారక చిహ్నాన్ని నిజానికి ఒక హిందూ రాజు నిర్మించినట్లు గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓక్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతని సిద్ధాంతం, పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా.. ‘‘ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నం, తేజోమహాలయ, సాధారణంగా తాజ్ మహల్ అని పిలుస్తారు. దీనిని క్రీ.శ 1155 లో రాజా పర్మార్ దేవ్ ముఖ్యమంత్రి సలాక్షన్ నిర్మించారు.’’

అయితే, 2000లో కోర్టు ఈ అభ్యర్ధనను ‘‘తప్పుగా భావించబడింది’’ అని పేర్కొంటూ కొట్టివేసింది. ఇది ప్రతి ఇతర రివిజనిస్ట్ పిటిషన్‌కు సులభంగా వర్తించే విశేషణం.

అయినప్పటికీ హిందూత్వ యోధులు అధైర్యపడలేదు. 2017లో ‘ఫైర్‌బ్రాండ్’ బీజేపీ నాయకుడు, అప్పటి ఎంపీ వినయ్ కటియార్, ఓక్ సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించారు. హిందూ దేవాలయాన్ని కూల్చివేసి స్మారక చిహ్నాన్ని అయోధ్య నుండి విస్తరించిన తర్వాత నిర్మించారని చెప్పారు. ఆ సంవత్సరం, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధించిన బ్రోచర్ నుండి తాజ్‌ను తొలగించింది. అది వివాదాస్పదం అవడంతో.. ‘‘ఇది చాలా ప్రసిద్ధి చెందింది, దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు” అంటూ యూపీ సర్కార్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

శిక్షణ పొందిన చరిత్రకారులు, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, ఇతర బాధ్యతాయుతమైన అధికారుల పరిశోధనలు, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే.. ఒక హిందూ పాలకుల హవేలీ ఆ ప్రదేశంలో ఉంది. షాజహాన్ తన ప్రాజెక్ట్ కోసం భూమిని ఉపయోగించుకోవడానికి దానిని కొనుగోలు చేసాడు. కోర్టు ‘ఫిర్మాన్’ (ఆర్డర్) నుండి అధికారిక చరిత్ర ‘బాద్‌షాహ్నామా’ వరకు ఈ సిద్ధాంతానికి అనేక ఆధారాలు ఉన్నాయి.

కానీ ఈ సాక్ష్యాలేవీ.. రైట్ వింగ్ వర్గానికి అవసరం లేదు. మనకు అనుకున్నదే నిజం అనే భ్రమలో ఉన్నవారికి ఎన్ని సాక్ష్యాలు చూపినా.. వారు అంగీకరించలేరు. మనకు తెలిసినదంతా తాజ్ మహల్ కింద ఒక ఆలయం ఉండొచ్చు. అనేక దేవాలయాల క్రింద బౌద్ధ, జైన ప్రార్థనా స్థలాలు ఉండొచ్చు అనే భావన మాత్రమే. చరిత్ర చాలా సుదీర్ఘమైనది. అనుమానం వచ్చిన ప్రతిచోటా తవ్వకుంటూ పోలేరు ఇదే వాస్తవం.

అహంకారం, విధ్వేసం వీడి చరిత్రను, వాస్తవాలను అర్థం చేసుకోవడం మంచిది. ‘ఠాగూర్ తాజ్‌ను ‘కాలపు చెంపపై తెల్లగా మెరిసే కన్నీటి చుక్క’గా అభివర్ణించారు. అలాంటి అందమైన చిహ్నాన్ని గర్వంగా భావించకుండా.. అక్కడ మరేదో ఉన్నదని ఊహించుకోవడం సరికాదు. జాతీయ అహంకారానికి మూలంగా ప్రతి ఒక్కరూ చూసిన దానిలో మతపరమైన, అవమానకరమైన విషయాన్ని చూడడానికి చాలా సంక్లిష్టమైన, తీవ్రమైన న్యూనతా భావన అవసరం.

భారతదేశానికి వ్యతిరేకంగా యూరోపియన్ పక్షపాతాలతో పోరాడుతూ.. మహాత్మా గాంధీ 1894లో దక్షిణాఫ్రికా శాసనసభ, శాసన మండలి సభ్యులకు సుదీర్ఘ ‘బహిరంగ లేఖ’ రాశారు. ఇది భారతీయ నాగరికత యొక్క గొప్పతనం అనే అంశంపై ఒక ఉత్తేజకరమైన, ఉత్కంఠభరితమైన వ్యాసం. భారతదేశం ఎలా నిజమో నిరూపించడానికి ఆయన వాస్తవాల మీద వాస్తవాలను, అభిప్రాయాల మీద అభిప్రాయాలను పోగు చేశారు. విశ్వగురువు, ఇది ప్రపంచానికి బోధించడానికి చాలా ఉంది.

భారతదేశ వాస్తుశిల్పంపై, గాంధీ.. ఆండ్రూ కార్నెగీ ‘రౌండ్ ది వరల్డ్’ (1884) నుండి ఉల్లేఖించారు. దీనిలో అమెరికన్ వ్యాపారవేత్త తాజ్ ‘‘విశ్లేషణకు, పదాలకు కూడా చాలా పవిత్రమైనది’’ అని భావించాడు. ‘‘మానవ నిర్మాణం చాలా అద్భుతమైనది, అసాధారణమైనది. దానిని ఈ పవిత్ర డొమైన్‌లోకి తీసుకురావడానికి…’’ అని గాంధీ ఈ మాటలు రాస్తున్నప్పుడు, ఏదో ఒక రోజు తన విధి ఈ స్మారక చిహ్నంతో ముడిపడి ఉంటుందని అతను ఊహించారా? అనే సందేహం కలుగక మానదు.

Follow Us