కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రైతుల ఆందోళన.. సుప్రీం కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఇలా ఉన్నాయి..

|

Jan 12, 2021 | 3:11 PM

కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం  వాదోపవాదాలు జరిగాయి. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు..

కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రైతుల ఆందోళన.. సుప్రీం కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఇలా ఉన్నాయి..
Follow us on

కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం  వాదోపవాదాలు జరిగాయి. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం ప్రకటించింది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ వెల్లడించింది.

వ్యవసాయ చట్టాల చట్టబద్ధత.. నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలు.. ఆస్తుల పరిరక్షణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని తమకున్న అధికారాల పరిధిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని సీజేఐ చెప్పారు. మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక స్పష్టత వస్తుంది అని చెప్పుకొచ్చారు. రైతులు కమిటీ వద్దకు వెళ్లరన్న దానిపై వాదనలు తాము వినదలచుకోలేదని..  రైతులు నిరవధిక ఆందోళనలు చేయదలచుకుంటే చేసుకోవచ్చని సీజేఐ అన్నారు.

కమిటీ అనేది మనందరి కోసమేనని.. సమస్యను పరిష్కరించాలనుకునే వాళ్లంతా కమిటీ ముందు తమ అభిప్రాయాలు చెప్పవచ్చని సీజేఐ చెప్పారు. కమిటీ ఉత్తర్వు ఇవ్వదు.. మిమ్మల్ని శిక్షంచబోదు.. నివేదికను మాత్రమే మాకు ఇస్తుంది.. అని సీజేఐ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి రావడం లేదని రైతులు అడుగుతున్నారు..

రైతుల తరఫున వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ పిటిషన్లు వేసిన అడ్వకేట్ ఎంఎల్ శర్మ తన వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఏర్పాటు చేసే ఏ కమిటీ ముందు తాము హాజరు కావాలనుకోవడం లేదని రైతులు చెబుతున్నట్టు కోర్టుకు విన్నవించారు. చర్చలకు చాలా మందే వస్తున్నప్పటికీ ప్రధాన వ్యక్తి అయిన ప్రధానమంత్రి రావడం లేదని రైతులు అంటున్నట్టు కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.

అడ్వకేట్ ఎంఎల్ శర్మ తన వాదనలకు సీజేఐ స్పందన..

దీనికి సీజేఐ స్పందిస్తూ… ప్రధానిని చర్చలకు వెళ్లమని మేము చెప్పలేమని స్పష్టం చేశారు. ఈ కేసులో ఆయన పార్టీ కాదు… తమకున్న అధికారులతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయగలమని అని అన్నారు. జ్యుడిషియల్ ప్రక్రియలో భాగమే కమిటీ అని.. చిత్తశుద్ధితో పరిష్కారం కోరుకునే రైతులు కమిటీ ముందుకు వెళ్లవచ్చని సీజేఐ పేర్కొన్నారు.

 

అటార్నీ జనరల్‌కు సీజేఐ సూటి ప్రశ్న…

రైతు నిరసనలకు నిషేధిత సంస్థ ఒకటి సహకరిస్తోందంటూ ఒక దరఖాస్తు తమ ముందు ఉందని ఆయన పేర్కొంటూ, అటార్నీ జనరల్ దీనిని అంగీకరిస్తారా, కాదంటారా అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ, నిరసనల్లోకి ఖలిస్థానీలు చొరబడ్డారని మాత్రమే తాము చెప్పామని కోర్టుకు తెలిపారు.