
కొల్హాపూర్ చెప్పులు.. మన సాంస్కృతిక సంపద. భారతీయ సాంప్రదాయ హస్తకళలలో ఒక ముఖ్యమైన భాగం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వంగా వచ్చిందీ వృత్తి. 12వ శతాబ్దంలో స్థానిక చర్మకారులు సాంప్రదాయ పద్ధతులతో చెప్పులను తయారు చేశారు. మొదట్లో వీటిని రాజులు, రాణులు, సైనికుల కోసం తయారు చేసేవారు. ముఖ్యంగా చంబార్ సమాజం ఈ తరహా చెప్పులను తయారు చేసేది. కొల్హాపూర్, సాంగ్లీ, సతారా వంటి ప్రాంతాల్లోని గ్రామీణ చర్మకారులు తమ కళను శతాబ్దాలుగా కొనసాగించారు.
కొల్హాపూర్ చెప్పుల ప్రత్యేకత చూస్తే…
జియోగ్రాఫికల్ ఇండికేషన్..GIట్యాగ్ అంటే అదో పేటెంట్ . అది పొందిన ఏ వస్తువైనా…మరొకరు అనుకరించడానికి వీల్లేదు. కానీ ప్రాడా సంస్థ యధేచ్చగా కొల్హాపూర్ చెప్పులను కాపీ కొట్టింది. మహారాష్ట్రలో వివాహాలు, ఉత్సవాలు, సాంప్రదాయ కార్యక్రమాలలో ఈ చెప్పులు ధరించడం సంప్రదాయంగా వస్తోంది. పురుషులు, మహిళలు వీటిని సాంప్రదాయ దుస్తులతో ధరిస్తారు. కొల్హాపూర్ చెప్పులు సౌకర్యవంతమైనవి, మన్నికైనవి కావడంతో చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే ఈమధ్య మిలన్లో జరిగిన ప్రాడా స్ప్రింగ్ ఫ్యాషన్ షోలో కొల్హాపూర్ చెప్పుల డిజైన్ను పోలిన చెప్పులు ప్రదర్శించారు. ప్రాడా అనే ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్, తమ కలెక్షన్లో “లెదర్ ఫ్లాట్ శాండల్స్” పేరుతో వీటిని షోకేస్ చేసింది. ఇప్పుడిదే వివాదాస్పదంగా మారింది ధరల విషయంలోనూ పెద్ద చర్చ జరుగుతోంది. శాండల్స్ ధర రూ.99వేలు నుంచి రూ.1.2 లక్షలు ఉండగా.. మన దగ్గర రూ.300 నుంచి రూ.3వేల మధ్య మాత్రమే ఉంది.
ప్రాడా ఫ్యాషన్ షోపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొల్హాపూర్ చెప్పులు భారతీయ వారసత్వంలో భాగమని, వాటిని కేవలం “లెదర్ శాండల్స్” అని పిలవడం సాంస్కృతిక దోపిడీ అంటూ ప్రాడాపై విరుచుకుపడుతున్నారు నెటిజన్స్ . దీనిపై పెద్ద ఎత్తున వివాదం రేగుతోంది. కొల్హాపూర్ చెప్పులనే కాపీ చేశామని ప్రాడా కూడా ఒప్పుకుంది. కానీ క్రెడిట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మన దగ్గర 300విలువ చేసే చెప్పులను లక్షరూపాయలకు అమ్మడంపైనా ప్రాడాపై విమర్శలు వస్తున్నాయి. ఇది సాంస్కృతిక దోపిడీగా చూడాలంటూ కొల్హాపురి చెప్పుల తయారీ దారులు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..