కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారుకు గండం..! ‘ఆపరేషన్ నాథ్’పై సిద్ధరామయ్య ఏమన్నారంటే..?

|

May 14, 2024 | 7:07 PM

మీ ప్రభుత్వం కూలిపోతుంది.. నీ సీఎం కుర్చి మడతబెట్టే రోజు రాబోతోందని ఒకరంటే. ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదని మరో ముఖ్యమంత్రి పంచ్ వేశారు. ఇది నీ ఇలాఖా కాదు.. నా అడ్డా అంటూ కౌంటర్ వేశారు. ఇంతకీ కౌంటర్లతో ఎన్ కౌంటర్ చేసుకుంటున్న ఆ ఇద్దరు సీఎంలు ఎవరు..? వాళ్లిద్దరి మధ్య గొడవకు రిజనేంటీ?

కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారుకు గండం..! ‘ఆపరేషన్ నాథ్’పై సిద్ధరామయ్య ఏమన్నారంటే..?
Eknath Shinde Siddaramaiah
Follow us on

ఏక్‌నాథ్ షిండే.. ఈ పేరు పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా పాపులర్. ఈ నేమ్ వినిపిస్తేనే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు షేక్ అవుతాయి. మహారాష్ట్రలో సొంత పార్టీని చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్‌ షిండే.. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. మహారాష్ట్ర ఎపిసోడ్ తరువాత అనేక రాష్ట్రాల్లో పార్టీల మధ్య షిండేల టాపిక్ చర్చకొచ్చింది. ఇప్పుడు..కర్నాటక సర్కార్ ని పడగొట్టేందుకు ‘ఆపరేషన్‌ నాథ్‌’ వ్యూహం రెడీ అయ్యిందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రే ఈ హింట్ ఇవ్వడం కర్నాటక రాష్ట్రంలో కలవరం మొదలైంది.

10 రోజుల క్రితం కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఏక్‌నాథ్ షిండే..మహారాష్ట్ర తరహాలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్‌ నాథ్‌’ సిద్ధమవుతోందని బాంబ్ పేల్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారు కూలడం ఖాయమని షిండే ప్రస్తావించిన వీడియో ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మహారాష్ట్రలో స్కెచ్ రెడీ అవుతోందని ఏక్‌నాథ్‌ షిండే అందులో ప్రస్తావించారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకు కర్నాటక రాష్ట్ర బీజేపీ నాయకులు తనను సాయం కోరినట్లు షిండే అనడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది.

నీ ప్రభుత్వం పడిపోతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఇటీవల చేసిన కామెంట్లపై… కర్నాటక సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఇది నీ రాష్ట్రం కాదు.. నా ఇలాఖా అంటూ సెటైర్ వేశారు. మహారాష్ట్రలో చేసినట్టు కర్ణాటకలో ఆపరేషన్ లోటస్‌ ఇంపాజిబుల్ అన్నారు. గతంలో తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించి విఫలైంది.. ఈ విషయంలో వాళ్లు ఫెయిల్ అవుతూనే ఉన్నారని సెటైర్ వేశారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరన్నారు. అది కేవలం పగటికల అని కామెంట్ చేశారు.

షిండే కామెంట్లను కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా కొట్టిపారేశారు. అది వారి భ్రమ అని.. ఎవరూ తమ ప్రభుత్వాన్ని పడగొట్టలేరని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో తన ప్రభుత్వం ఉంటుందో.. ఉండదోనని షిండేకు భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని శివకుమార్‌ అన్నారు.

బలాబలాలు ఇవే..

కర్నాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 136 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 66 మంది, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నుంచి 19 మంది. ప్రస్తుతం రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. రెండు పార్టీల సభ్యులు కలిస్తే ఆ సంఖ్య 85. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు వస్తే తప్ప.. ప్రభుత్వం పడిపోవడం సాధ్యంకాదు. అయితే లోక్‌సభ ఎన్నికల తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని షిండే అన్నట్టుగా జరుగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..