Meerut murder case: ‘మాకు భోజనం వద్దు.. గంజాయి కావాలి..’ జైల్లో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్

దేశం ఉలిక్కిపడేలా చేసిన యూపీ నేవీ అధికారి దారుణ హత్యలో కళ్లుచెదిరే విషయాలు బయటపెట్టారు పోలీసులు. ముస్కాన్, సాహిల్ డ్రగ్స్‎కు బానిసలయ్యారని పోలీసులు గుర్తించారు. జైలులో కూడా తమకు ఆహారం వద్దని.. డ్రగ్స్, గంజాయి ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు.

Meerut murder case: మాకు భోజనం వద్దు.. గంజాయి కావాలి.. జైల్లో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్
Sahil Shukla - Muskan Rastog

Updated on: Mar 23, 2025 | 8:00 PM

ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో దారుణమనే పదం కూడా చిన్నబోయేలా జరిగిన నేవీ అధికారి హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే సంగతులు వెలుగులోకి తెచ్చారు పోలీసులు. నేవీ అధికారి భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ చాలాకాలంగా డ్రగ్స్‌కు బానిసలుగా మారినట్లు గుర్తించారు. హత్య సమయంలోనూ సాహిల్‌ డ్రగ్స్‌ మత్తులోనే ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న వీరిద్దరూ భోజనానికి బదులు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరడంతో జైలు అధికారులు సైతం షాక్‌ తిన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అరెస్టు నాటి నుంచి మత్తు దొరక్క వింతగా ప్రవర్తిస్తున్నట్లు నిర్ధారించారు. జైలుకు వచ్చిన తొలిరోజు నుంచే తిండి తినక వారిద్దరి ఆరోగ్యం క్షీణించడంతో సాహిల్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. సాహిల్‌ మానసిక స్థితి మందగించడంతో తోటి ఖైదీలపై దాడికి దిగే ఛాన్స్‌ ఉందన్న వైద్యుల సూచనతో జైలులోని డీ అడిక్షన్‌ కేంద్రంలో చికిత్స కొనసాగిస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో ప్రధాన సూత్రధారి ముస్కాన్‌ తన తరఫున కేసు వాదన కోసం న్యాయవాది కావాలని డిమాండ్‌ చేస్తోంది. తనపై తల్లిదండ్రులు కోపంతో ఉండడంతో లాయర్‌ను పెట్టేస్థితిలో లేరంటోంది. తనకు న్యాయం చేసేందుకు కోర్టులో కేసు వాదించేలా లాయర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది ముస్కాన్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..