
Proud to be an Indian : కన్నీళ్లకు.. భావోద్వేగాలకు.. మంగళవారం రాజ్యసభ వేదకైంది. రాజ్యసభలో ఎమోషన్ అయిన పార్టీల నేతలు.. కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ పదవీ కాలం ఈ నెల 15తో ముగియనుంది. ఆయనకు వీడ్కోలు చెప్పే కార్యక్రమంపై ప్రసంగించిన నేతలంతా ఆజాద్ సేవలపై పొగడ్తలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఆజాద్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆజాద్పై ప్రశంసలు కురిపించారు. ఆజాద్ గురించి మాట్లాడే సమయంలో ప్రధాని కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. కళ్ల జోడు తీసి కన్నీరు తుడుచుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. ఆజాద్ సేవల్ని వదులుకోవడం తనకు ఇష్టం లేదని.. ఆయన సలహాలు సూచనలు తనకు అవసరం అన్న ప్రధాని.. ఆజాద్ కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆజాద్ చేసిన సహయాన్ని గుర్తు చేసుకున్న మోడీ ఉద్వేగానికి లోనయ్యారు.
అనంతరం, ఆజాద్ తన వీడ్కోలు ప్రసంగంలో ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జమ్ము కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకూ సాగిన తన రాజకీయ ప్రస్థానాన్ని తలుచుకుంటూ, సభను ఎలా నడపాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేర్చుకున్నానని ఆజాద్ అన్నారు. సభలో ప్రతిష్ఠంభనను ఎలా తొలగించాలి, ఎలా సభను నడపాలనేది ఆయన నుంచే నేర్చుకున్నట్టు చెప్పారు.తాను పాకిస్తాన్కు ఒక్కసారి కూడా వెళ్లలేదన్నారు.
హిందుస్థానీ ముస్లింగా తాను గర్విస్తున్నానని ఆజాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేను ఒక్కసారి కూడా పాకిస్థాన్ వెళ్లలేదు. నేను ఆ మేరకు అదృష్టవంతుడిని అని పేర్కొన్నారు. పాకిస్తాన్లో పరిస్థితులను తెలుసుకున్నప్పుడు, హిందుస్థాన్ ముస్లింగా నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను అని ఆజాద్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఆజాద్ను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. మేం చేస్తాం: కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు