Good News: ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?

PMAY-U 2.0: సొంతిల్లు.. అనేది సగటు మనిషి జీవితకాల కల. ఆ కలని నిజం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయమం తీసుకుంది. పట్టణ పేదల తలరాతను మారుస్తూ, అద్దె ఇళ్ల కష్టాల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 ఇప్పుడు సరికొత్త వేగంతో దూసుకుపోతోంది. లక్షలాది కుటుంబాలకు చిరునవ్వుల తెస్తూ భారీగా కొత్త ఇండ్లను మంజూరు చేసింది.

Good News: ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?
Pradhan Mantri Awas Yojana Urban

Updated on: Feb 25, 2026 | 3:16 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 పథకానికి సంబంధించి కేంద్రం కీలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న న్యూఢిల్లీలో జరిగిన 6వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కొత్తగా 2.88 లక్షల ఇళ్లనుమంజూరు చేసింది. కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ కటికితల అధ్యక్షతన జరిగిన ఈ నిర్ణయంతో PMAY-U 2.0 కింద ఇప్పటివరకు మంజూరైన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61 లక్షలకు చేరుకుంది. ఈ విడతలో మంజూరైన ఇళ్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. మొత్తం 2.88 లక్షల ఇళ్లలో 1.60 లక్షల కంటే ఎక్కువ ఇళ్లను మహిళలకే కేటాయించడం విశేషం.

అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు 22,581 ఇళ్లు, ఎస్సీ వర్గాలకు 35,525, ఎస్టీలకు 9,773, ఓబీసీ లబ్ధిదారులకు 82,190 ఇళ్లను కేటాయించారు. ట్రాన్స్‌జెండర్ల కోసం కూడా 8 ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేశారు. ఈ పథకం అమలులో తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లబ్ధి పొందుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ ఇళ్ల నిర్మాణం వేగవంతం కానుంది. ముఖ్యంగా వలస కార్మికులు, వీధి వ్యాపారుల కోసం అద్దె ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి చోట్ల తక్కువ ఖర్చుతో కూడిన ఆధునిక నిర్మాణ పద్ధతులను ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నారు.

2015లో ప్రారంభమైన ఈ బృహత్తర పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 122.50 లక్షల ఇళ్లు మంజూరు కాగా అందులో 97 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందాయి. కొత్తగా నిర్మించే ఇళ్లు కేవలం నివాసాలే కాకుండా అవి రవాణా సౌకర్యాలకు దగ్గరగా, నగర పరిధిలోనే ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ పథకం పట్టణ పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు కేవలం నీడను మాత్రమే కాకుండా, ఆర్థిక మరియు సామాజిక భద్రతతో కూడిన గౌరవప్రదమైన జీవనాన్ని అందిస్తోంది.

Follow Us