గ్రిడ్ వైఫల్యం కారణంగా ముంబైలో సోమవారం ఉదయం ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది. కొన్ని గంటలపాటు ఈ అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. అయితే పన్నెండు గంటల ప్రాంతంలో గ్రిడ్ కొంతవరకు మళ్ళీ పని చేయడంతో విద్యుత్ సరఫరాను పాక్షికంగా పునరుధ్ధరించగలిగారు. మెట్రో సర్వీసులు కూడా అక్కడక్కడ తిరిగి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే..విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ తోను, బీఎంసి కమిషనర్ తోను మాట్లాడి సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో పునరుధ్దరించేలా చూడాలని ఆదేశించారు.