
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒక మహిళ విషయంలో వైద్య నిర్ధారణ లేకుండానే ఆమె మృతి చెందినట్లు పోలీసులు భావించి గదికి తాళం వేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బెమెతరా వార్డు నంబర్-7లోని పరుశురామ్ చౌక్ ప్రాంతంలో ముగ్గురు పిల్లల తల్లి అయిన ఒక మహిళ గడచిన 10 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఆగస్టు 21న ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే, తాడు బలహీనంగా ఉండటంతో తెగిపోయి ఆ మహిళ తీవ్ర గాయాలతో కిందపడిపోయింది. పిల్లలు పాఠశాల నుంచి తిరిగి వచ్చి తల్లిని అలా అచేతన స్థితిలో చూసి యజమానికి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ ప్రాణాలతో ఉందో లేదో కనీసం ప్రాథమిక తనిఖీలు లేదా వైద్య పరీక్షలు నిర్వహించలేదు. ఆమె మృతి చెందినట్లు తమకు తామే నిర్ధారించుకుని, మృతదేహాన్ని పంచనామా చేయడానికి ఆ తర్వాత వస్తామని చెబుతూ గదికి తాళం వేసి వెళ్లిపోయారు.
సుమారు మూడు గంటల సమయం తర్వాత పోలీసులు ఒక మహిళా కానిస్టేబుల్తో కలిసి విచారణ ప్రాసెస్ పూర్తి చేసేందుకు గది తాళం తెరిచారు. తాళం తెరవగానే అక్కడి దృశ్యం చూసి పోలీసులకు సైతం షాక్ తిన్నంత పనైంది. ఆ మహిళ ఇంకా ఊపిరి తీసుకుంటూ, కదులుతూ జీవించి ఉంది. వెంటనే పోలీసులు, కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళను రక్షించాల్సింది పోయి, కనీసం పరిక్షించకుండా చనిపోయిందని నిర్ధారించి తాళం వేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సమయానికి ప్రాథమిక చికిత్స అందించి ఉంటే మహిళకు ఈ పరిస్థితి వచ్చేది కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో ఎస్డీఓపీ భూషణ్ ఇక్కా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారం, పోలీసుల వైఖరిపై సమగ్ర విచారణ జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..