ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ

తనను, దివంగత తల్లిని దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని కోరుతూ, జీరో ఎఫ్‌ఐఆర్ నేపథ్యం లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ
Pm Modi

Updated on: Aug 01, 2026 | 9:01 AM

కొంతమంది పిల్లలు తనను, తన దివంగత తల్లిని దూషించారని, అయితే వారు మిస్ గైడ్ అయిన విద్యార్థులని అందుకే తాను వారిని క్షమిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శిక్షించడం లేదా సుదీర్ఘ న్యాయపరమైన చర్యలకు గురిచేయడం కంటే వారికి సరైన మార్గనిర్దేశం చేయడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసిన వీడియో సందేశంలో మోదీ స్పందించారు.

నిరసనలో కొంతమంది ఉపయోగించిన భాష ఏ నాగరిక సమాజానికీ తగినది కాదని ప్రధాని అన్నారు. తనను మాత్రమే కాకుండా తన దివంగత తల్లిని కూడా అత్యంత అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారని చెప్పారు. అయితే, అలాంటి ఘటనలపై ప్రతీకారం తీర్చుకోవడం కంటే, వారు ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం చేసుకుని వారికి సరైన దిశలో మార్గనిర్దేశం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

వీడియో చూడండి

“వీరు దారి తప్పిన పిల్లలు. వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం లేదా సమాజంలో అవమానించడం వల్ల పరిస్థితులు మారవు. వారిని సరిదిద్దేందుకు మనం ప్రయత్నించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఒక ఉపమానం కూడా చెప్పారు. “కొన్నిసార్లు మన నాలుక పొరపాటున పళ్ల కిందకు వచ్చి గాయమవుతుంది. కానీ అందుకని మనం పళ్లను విరగ్గొట్టం. ఎందుకంటే పళ్లు కూడా మనవే, నాలుక కూడా మనదే. అలాగే పిల్లలు కూడా మన సమాజానికే చెందినవారు. వారి తప్పులను సరిదిద్దడం మన బాధ్యత” అని ప్రధాని వివరించారు. విద్యార్థులు గత ఘటనలను మరిచి దేశాభివృద్ధి కోసం ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. “పిల్లలారా, మనమందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. కొత్త విషయాలు నేర్చుకుందాం. తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకుందాం. నేను మీ భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నాను” అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us