
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్స్ సత్తా చాటిన విషయం తెలిసిందే. చైనాలోని హాంగ్జౌలో జరుగుతోన్న ఏషియన్ గేమ్స్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఏకంగా 107 పతకాలు సొంతం చేసుకొని భారత అథ్లెట్స్ అరుదైన ఘనతను సాధించారు.
ఇన్నేళ్ల ఏషియన్ క్రీడా చరిత్రలో భారత్ తొలిసారి 100 పతకాలు సాధించడంపట్ల యావత్ దేశం సంతోషం వ్యక్తం చేసింది. ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆనందం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా క్రీడాకారులను మోదీ అభినందించారు. ఆసియా క్రీడల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచారంటూ ట్వీట్ చేశారు. ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన క్రీడాకారులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్న ప్రధాని మోదీ.. తాను త్వరలోనే క్రీడాకారులను కలుసుకుంటానంటూ, ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, ప్లేయర్స్తో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
What a historic achievement for India at the Asian Games!
The entire nation is overjoyed that our incredible athletes have brought home the highest ever total of 107 medals, the best ever performance in the last 60 years.
The unwavering determination, relentless spirit and hard… pic.twitter.com/t8eHsRvojl
— Narendra Modi (@narendramodi) October 8, 2023
ఈ నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఆసియా క్రీడల బృందంతో మాట్లాడనున్నారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారతీయ అథ్లెట్స్తో మోదీ మాట్లాడనున్నారు. ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను అభినందించడంతో పాటు భవిష్యత్తులో జరిగే పోటీలకు వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 107 పతకాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆసియా క్రీడల్లో ఇంత వరకు భారత్ గెలుచుకున్న అత్యధిక పతకాలు ఇవే కావడం విశేషం. ఇక ఢిల్లీలో చేపట్టనున్న కార్యక్రమానికి క్రీడాకారులతో పాటు వారి కోచ్లు, ఇండియల్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు హాజరుకానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..