
వికసిత్ భారత్ దిశగా దేశం ముందడుగు వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..బిహార్లో రికార్డు ఓటింగ్ జరిగిందని, ఎన్నికల్లో మహిళ ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని, చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి అని అన్నారు. దేశ ప్రగతి కోసం పార్లమెంట్లో మంచి చర్చలు కొనసాగాలని, దేశ అభివృద్ది కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని మోదీ కోరారు. పరాజయం కూడా ఒప్పుకునే మనస్సు విపక్షానికి లేదని, తాము మాత్రం విపక్షాలను కలుపుకుని ముందుకెళ్తామని సూచించారు.
“ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా. మా ప్రధాన లక్ష్యం దేశాభివృద్ధి మాత్రమే. దేశ ప్రగతి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని అందరినీ కోరుతున్నా.. కొత్త ఎంపీలకు స్పూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి. చట్ట సభల్లో డ్రామాలు వద్దు.. మంచి చర్చలు జరగాలి. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలవద్దని కోరుతున్నా. జీఎస్టీ సంస్కరణల తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారు” అని మోదీ స్పష్టం చేశారు.
కాగా నేటి నుంచి 15 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు పట్టుపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఢిల్లీ పేలుడు ఘటన, దేశ భద్రత, రైతుల సమస్యలు, డిల్లీ వాయు కాలుష్యంపై చర్చించాలని విపక్ష పార్టీలు కోరుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. కాలం చెల్లిన 120 చట్టాలను రద్దు చేసే బిల్లును తీసుకురానుంది.