
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈద్, నౌరూజ్ పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులపై చర్చించారు. “ఈ పండుగల కాలం ఆ ప్రాంతానికి శాంతి, స్థిరత్వం, అభివృద్ధి తీసుకురావాలని ఆశిస్తున్నాం” అని మోదీ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో కీలక మౌలిక వసతులపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాక, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాల భద్రతపై మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. “నావిగేషన్ స్వేచ్ఛను కాపాడడం అత్యంత అవసరం. రవాణా మార్గాలు ఎప్పుడూ తెరిచి, భద్రంగా ఉండాలి” అని ఆయన అన్నారు.
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాంతీయ శాంతి, ప్రపంచ వాణిజ్య రక్షణపై భారత్ తన ఆందోళనలను స్పష్టంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.