PM Modi: అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదలకు మార్గదర్శకుడైన ఎల్‌.కె. అద్వానీ 98వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన నివాసానికి వెళ్లి పూలగుచ్ఛం అందజేశారు. అద్వానీని "దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు, భారత అభ్యున్నతికి అంకితభావంతో సేవచేసిన మహానుభావుడు"గా మోదీ కొనియాడారు.

PM Modi: అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
PM Modi - LK Advani

Updated on: Nov 08, 2025 | 9:30 PM

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌.కె.అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ.. అద్వానీకి పూలగుచ్ఛం అందజేసి ఆప్యాయంగా పలకరించారు. 98వ ఏట అడుగుపెట్టిన అద్వానీ ఈ ఏడాది భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో సత్కరించబడిన విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధాన మంత్రి సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు.

“శ్రీ ఎల్‌.కె. అద్వానీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. దూరదృష్టి, మేధస్సు కలిగిన ఓ రాజనీతిజ్ఞుడు అయిన అద్వానీ జీ తన జీవితాన్ని భారత అభ్యున్నతికి అంకితం చేశారు. ఆయన త్యాగం, కర్తవ్యనిబద్ధత మన ప్రజాస్వామ్యానికి, సాంస్కృతిక పునాది కోసం చెరగని ముద్ర వేశారు” అని మోదీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఆయనకు ఎల్లప్పుడూ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తున్నానని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అద్వానీ నాయకత్వంలోనే బీజేపీ జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన శక్తిగా ఎదిగిన విషయాన్ని పార్టీ వర్గాలు మరోసారి గుర్తుచేసుకున్నారు.