ఫ్రాన్స్‌కు చేరిన ఏపీ, తెలంగాణ ఖ్యాతి.. విదేశీ అగ్రనేతలకు తెలుగు కానుకులు ఇచ్చిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చారు. ఫ్రాన్స్, స్లొవేకియా దేశాధినేతలకు ప్రధాని మోదీ అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చారు. అందులో మన తెలుగు రాష్ట్రాల కళల వైభవాలు కూడా ఉండడం గమనార్హం. ఫ్రాన్స్ అధ్యక్షుడికి 6 నెలలు శ్రమించి గీసిన కలంకారీ మహాభారత పెయింటింగ్, ఆ దేశ ప్రథమ మహిళకు పోచంపల్లి పట్టు వంటి కానుకలను అందజేశారు.

ఫ్రాన్స్‌కు చేరిన ఏపీ, తెలంగాణ ఖ్యాతి.. విదేశీ అగ్రనేతలకు తెలుగు కానుకులు ఇచ్చిన మోదీ
Pm Modi Gifts To French And Slovakia Presidents

Updated on: Jun 19, 2026 | 6:11 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించుకుని శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటన కేవలం ఉన్నత స్థాయి దౌత్య చర్చలకే పరిమితం కాకుండా భారతదేశపు సంపన్న హస్తకళల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా సాగింది. తన కల్చరల్ డిప్లొమసీలో భాగంగా.. ఆయా దేశాల అగ్రనేతలకు మోదీ అందించిన ప్రత్యేక కానుకలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. మన తెలుగు రాష్ట్రాల కళలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల విశిష్ట ఉత్పత్తులను ఆయన బహూకరించారు.

ఫ్రాన్స్ దేశానికి తెలుగు కళల వైభవం

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు మహాభారత కలంకారీ పెయింటింగ్‌ను మోదీ బహమతిగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ విశిష్ట పెయింటింగ్‌ను కేవలం పెన్-డ్రాయింగ్ టెక్నిక్స్‌తో సహజ సిద్ధమైన రంగులతో రూపొందించడానికి కళాకారులకు 6 నెలల సమయం పట్టింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య బోధ చేసే ఘట్టాలతో పాటు.. నైతిక నాయకత్వం, శాంతి, మానవ విలువల సందేశాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్‌కు పోచంపల్లి సిల్క్ స్టోల్‌ను మోదీ అందించారు. తెలంగాణకు చెందిన ప్రసిద్ధ ఇకత్ చేనేత శైలిలో రూపొందించిన ఈ సిల్క్ స్టోల్‌ను ఆమెకు బహూకరించారు. ఫ్యాషన్‌కు కేరాఫ్ అయిన ఫ్రాన్స్ దేశాన్ని ఆకట్టుకునేలా దీని జ్యామితీయ, పూల డిజైన్లు అలరించాయి.

స్లోవేకియా ప్రధానికి కాశ్మీరీ పట్టు తివాచీ

స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకమైన కాశ్మీరీ సిల్క్ కార్పెట్‌ను కానుకగా ఇచ్చారు. శ్రీనగర్ ప్రాంతానికి చెందిన కళాకారులు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన పట్టుతో ఎంతో క్లిష్టమైన డిజైన్లతో దీనిని చేత్తో నెయ్యడానికి కొన్ని నెలల నుండి సంవత్సరాల కాలం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి లగ్జరీ ఆర్ట్ ఫామ్‌గా మంచి గుర్తింపు ఉంది.

స్లోవేకియా అధ్యక్షుడికి హిమ్రూ సిల్క్ టై & థేవా కఫ్లింక్స్

స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినికి ప్రధాని మోదీ రెండు అద్భుతమైన కానుకలను అందించారు.

హిమ్రూ సిల్క్ టై – పాకెట్ స్క్వేర్: ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ హిమ్రూ చేనేత శైలిలో రూపొందించిన సిల్క్ కాటన్ బ్లెండ్ టై సెట్ ఇది. భౌగోళిక గుర్తింపు పొందిన ఈ వస్త్రం దాని రివర్సిబుల్ వీవింగ్ శైలికి ప్రసిద్ధి.

హ్యాండ్‌క్రాఫ్టెడ్ థేవా మోటిఫ్ కఫ్లింక్స్: రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన పురాతన, అరుదైన థేవా జ్యువెలరీ టెక్నిక్‌తో తయారు చేసిన కఫ్లింక్స్ ఇవి. రంగుల గాజుపై బంగారు రేకులను కరిగించి ప్రకృతి డిజైన్లతో దీనిని అత్యంత నైపుణ్యంతో రూపొందిస్తారు. ఇది కూడా జీఐ ట్యాగ్ పొందిన విశిష్ట కళ.

స్పీకర్‌కు ఆయుర్వేద గ్రంథాలు – బీహార్ స్వీట్ తెకువా

స్లోవేకియా స్పీకర్ రిచర్డ్ రాసికి ప్రధాని మోదీ భారతదేశ ప్రాచీన వైద్య విజ్ఞానాన్ని, సాంప్రదాయ రుచులను పరిచయం చేశారు. భారతీయ ఆయుర్వేద వైద్యానికి మూలస్తంభాలైన ఆచార్య చరక రాసిన చరక సంహిత, అలాగే ప్రపంచంలోనే తొలి శస్త్రచికిత్సల వివరాలు ఉన్న సుశ్రుత సంహిత గ్రంథాలను ఆయనకు బహూకరించి భారతీయ విజ్ఞాన గొప్పతనాన్ని చాటారు. అంతేకాకుండా గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, సోంపు గింజలతో తయారు చేసే బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సాంప్రదాయ పండుగ ప్రసాదం తెకువాను కూడా మోదీ ఆయనకు తినిపించడం విశేషం. ఈ విధంగా ప్రధాని మోదీ తన పర్యటనలో భారతదేశంలోని ప్రతి మూలన ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించి సరికొత్త మైలురాయిని లిఖించారు.

Follow Us