ఆ సీట్లో నేను కూర్చోలేదు… తనపై ఆరోపణలను ఖండించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సమయంలో తాను రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుర్చీలో కూర్చున్నానంటూ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు.

ఆ సీట్లో నేను కూర్చోలేదు... తనపై ఆరోపణలను ఖండించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

Updated on: Feb 10, 2021 | 11:09 AM

Amit Shah clarified : తనపై ఆరోపణలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు. విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సమయంలో తాను రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుర్చీలో కూర్చున్నానంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధురి చేసిన ఆరోపణలు ఏమాత్రం నిజం కాదని అమిత్‌ షా స్పష్టం చేశారు. పర్యాటకులకు కేటాయించిన విండో సీట్‌లోనే ఆసీనుడినయ్యానని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మంగళవారం లోక్‌సభకు తీసుకొచ్చిన ఆయన వాటిని సభ ముందు ఉంచడానికి సభాపతి అనుమతి కోరారు.

దీనిపై వివరణ ఇచ్చిన అమిత్ షా.. ‘‘నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసుకునేందుకు విశ్వభారతి వైస్‌ ఛాన్స్‌లర్‌ను ఓ నివేదిక కోరాను. ఆ ఫొటోలు, వీడియోలను వీక్షించి నేను ఠాగూర్‌ సీట్లో కూర్చున్నానో.. లేదో చెప్పండి’’ అని అమిత్‌ షా అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కూర్చున్న విండో సీట్‌లోనే తానూ కూర్చున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకులకూ అక్కడ కూర్చొనే అవకాశం ఉంటుందని అమిత్ షా గుర్తు చేశారు.

కాగా, సభలో మాట్లాడేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని సభ్యులకు సూచించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడానికి… అధీర్‌ పార్టీ నేపథ్యమే కారణమని ఆరోపించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుర్చీలో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కూర్చున్న ఫొటోలను అమిత్ షా లోక్‌సభలో చూపించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై అధీర్‌ చేసిన ఆరోపణలనూ ఆయన తిప్పికొట్టారు. బెంగాల్‌ పర్యటన సందర్బంగా.. శాంతినికేతన్‌లోని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుర్చీలో కేంద్ర మంత్రి అమిత్‌ షా కూర్చున్నారని కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి సోమవారం లోక్‌సభలో ఆరోపించగా దీనిపై దుమారం రేగింది.

Read Also ….  పంజాబ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

Follow Us