
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పేపర్ లీకేజీల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీలో గోమూత్ర నిపుణుడు ఉన్నారంటూఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఒక బాధ్యతాయుతమైన శాస్త్రవేత్తపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా, పరిశోధనా రంగాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
బహిరంగ లేఖ ప్రకారం.. ప్రొఫెసర్ వి. కామకోటి భారతదేశంలోనే ప్రముఖ కంప్యూటర్ సైన్స్ పరిశోధకులలో ఒకరు. ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఎం.ఎస్, పిహెచ్డి పట్టాలు పొందారు. 150కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించడమే కాకుండా, 50కి పైగా ప్రసిద్ధ ఆర్అండ్డి ప్రాజెక్టులలో భాగస్వామిగా ఉన్నారు. భారత్ రూపొందించిన మొదటి ఇండస్ట్రీ గ్రేడ్ మైక్రోప్రాసెసర్ వెనుక ఆయన కీలక పాత్ర పోషించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు ఆయన సొంతం. శాస్త్రవేత్తల ప్రతిపాదనలపై విమర్శలు చేయవచ్చు, కానీ వారి సేవలను హేళన చేస్తూ మాట్లాడటం సరైన పద్ధతి కాదు విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు
భారత రాజ్యాంగం ప్రకారం పౌరులలో శాస్త్ర విజ్ఞాన స్పృహ పెంపొందించడం అత్యంత ముఖ్యమని.. సాంప్రదాయ జ్ఞానంపైన గానీ, కొత్త ఆలోచనలపైన గానీ శాస్త్రీయంగా చర్చించడం, నిరూపించబడే వరకు వేచి చూడడం శాస్త్రీయ దృక్పథంలో భాగమని అన్నారు. ఒక విద్యావేత్తను కేవలం ఒక లేబుల్తో తోసిపుచ్చడం ప్రజాస్వామ్యానికి, శాస్త్రీయ విజ్ఞానానికి మంచిది కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం సంక్లిష్టమైన శాస్త్రీయ అంశాలను ఎగతాళి చేయడమో, లేదా వ్యక్తిగత ఆరోపణలు చేయడమో సమాజానికి నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు వేసే ఇటువంటి నిందలు, దేశంలో స్వేచ్ఛగా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలలో భయాన్ని, నిరాశను నింపుతాయని పలువురు పేర్కొన్నారు. విమర్శలు సహేతుకంగా, అధారాలతో కూడి ఉండాలే తప్ప, అవహేళన చేసే విధంగా ఉండకూడదని, రాబోయే రోజుల్లో పార్లమెంట్ చర్చలు గౌరవప్రదంగా సాగుతాయని ఆశిస్తున్నట్లు ఈ మేరకు లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.