AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పహల్గాం పిలుస్తోంది.. ఏడాది తర్వాత ఇప్పుడెలా ఉందో తెలుసా..?

పచ్చని అందాలతో పరవశించే పహల్గాం సోయగం.. సరిగ్గా ఏడాది క్రితం నెత్తురోడింది. ఉగ్రవాదులు చేసిన గాయం మానడానికి సమయం పడుతున్నా.. భయాన్ని చీల్చుకుంటూ పర్యాటకులు మళ్లీ లోయలో అడుగుపెడుతున్నారు. గతేడాది ఏప్రిల్ 22న జరిగిన ఆ చీకటి ఘటనకు ఏడాది పూర్తవుతున్న వేళ.. పహల్గాం పాత వైభవం కోసం పరితపిస్తోంది. ప్రస్తుతం పహల్గాం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..

పహల్గాం పిలుస్తోంది.. ఏడాది తర్వాత ఇప్పుడెలా ఉందో తెలుసా..?
One Year After Pahalgam Terror Attack
Krishna S
|

Updated on: Apr 20, 2026 | 6:54 PM

Share

సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఆ చేదు జ్ఞాపకం నుండి పహల్గాం నెమ్మదిగా కోలుకుంటోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలోని లిటిల్ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసారన్ మైదానంలో జరిగిన ఉగ్రదాడి పర్యాటక రంగాన్ని కుదిపేసింది. ఆ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పోనీవాలా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ఘోర సంఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న తరుణంలో భయం నీడలను వీడి పర్యాటకులు మళ్లీ ఈ అందమైన ప్రాంతానికి చేరుకుంటున్నారు.

కుదేలైన పర్యాటక ఆర్థిక వ్యవస్థ

పర్యాటకమే జీవనాధారంగా ఉన్న పహల్గాంలో ఆర్థిక మాంద్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక వ్యాపారుల మాటల్లో ఆ వేదన స్పష్టమవుతోంది. పహల్గాం హోటల్స్ అసోసియేషన్ అధిపతి జావేద్ బుర్జా తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులు పగటిపూట వచ్చి వెళ్తున్నారు తప్ప, రాత్రి బస చేయడానికి సాహసించడం లేదు. పర్యాటకులను ఆకర్షించడానికి గదుల ధరలను 50శాతం నుండి 60శాతం వరకు తగ్గించినప్పటికీ, ఆక్యుపెన్సీ రేటు ఆశాజనకంగాలేదు. ఇది సిబ్బంది తొలగింపునకు, కొన్ని హోటళ్ల మూతకు దారితీసింది. రెస్టారెంట్ యజమాని హిలాల్ అహ్మద్ మాట్లాడుతూ.. గతంలో వారాంతాల్లో రూ.50,000 వరకు వచ్చే ఆదాయం, ఇప్పుడు కనీసం రూ.8,000 కూడా దాటడం లేదని తెలిపారు. పర్యాటకులు ఎక్కువగా రాకపోవడం వల్ల రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న తినుబండారాల దుకాణాలు వెలవెలబోతున్నాయి. పహల్గాం అందాలను చూపించే పోనీవాలాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రోజుకు కేవలం రూ. 500 సంపాదించడం కూడా గగనమైపోతోంది.

టెక్నాలజీతో భద్రత: క్యూఆర్ కోడ్ విప్లవం

గత ఏడాది జరిగిన వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం, పర్యాటకుల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. ఇప్పుడు పహల్గాంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు ఒక పోనీవాలాను గానీ, గైడ్‌ను గానీ నమ్మే ముందు వారి గుర్తింపు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే సదరు వ్యక్తి ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్, వారిపై ఏవైనా క్రిమినల్ రికార్డులు ఉన్నాయా లేదా అనే పోలీస్ వెరిఫికేషన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనివల్ల గుర్తుతెలియని వ్యక్తుల నుండి పర్యాటకులకు రక్షణ లభిస్తోంది.

లిటిల్ స్విట్జర్లాండ్ పరిస్థితి ఏమిటి?

పర్యాటకులకు అత్యంత ఇష్టమైన బైసారన్ మెడోస్ ఇంకా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోలేదు. ఉగ్రదాడికి ప్రధాన వేదికైన ఈ మైదానం భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో మూసివేశారు. అధికారులు ఇప్పుడు దశలవారీగా పర్యాటక ప్రదేశాలను తెరుస్తున్నప్పటికీ, భద్రతా తనిఖీలు అత్యంత కఠినంగా ఉన్నాయి.

హై లెవల్ సెక్యూరిటీ రివ్యూ

ఘటన జరిగి ఏడాది పూర్తవుతుండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాశ్మీర్ ఐజీపీ వి.కె. బిర్ది కీలక సమావేశం నిర్వహించారు. పోలీసులు, CRPF, BSF, ఆర్మీ సంయుక్తంగా పర్యాటక కారిడార్లలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశాయి. కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా, డ్రోన్ల ద్వారా పర్యాటక ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచారు.

పహల్గాం అందాలు పర్యాటకులను మళ్లీ పిలుస్తున్నాయి. లోయలో అక్కడక్కడ వినిపిస్తున్న సెల్ఫీ కెమెరాల క్లిక్ మనిపిస్తున్న శబ్దాలు ఆశ చిగురించేలా చేస్తున్నాయి. పర్యాటకులు తాము సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నప్పటికీ, వ్యాపారులు మాత్రం పాత రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. గాయపడిన పహల్గాం కోలుకోవడానికి సమయం పట్టవచ్చు, కానీ శాంతి దిశగా అది వేస్తున్న అడుగులు మాత్రం పటిష్టంగా ఉన్నాయి.

Follow Us