భువనేశ్వర్, సెప్టెంబర్ 18: ఈ రోజుల్లో సోషల్ మీడియాల్లో ఫ్రెండ్స్కు కొదవేలేదు. ఇక ఫేస్బుక్ సంగతైతే చెప్పక్కర్లేదు. ముఖ పరిచయం లేకపోయినా అన్ని విషయాలు వారితో పంచుకుంటుంటారు. తాజాగా ఓ ముఠా ఫేస్బుక్ ద్వారా యువకులతో స్నేహం పెంచుకొని అదునుచూసి వారిని ఇంటికి పిలించుకునే వారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బు దోచుకుంటున్నారు. ఇలా ఎందరో అమాయకులు వీరి వలలో పడి మోసపోయారు. తాజాగా ముఠాకు చెందిన నలుగురిని భువనేశ్వర్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. డీసీపీ ప్రతీక్ సింగ్ విలేకరుల సమావేశంలో వీరి వివరాలు వెల్లడిస్తూ..
ఇరానీ పాత్ర్ అనే మహిళ, ఆమె భర్త రవి పాత్ర్ ఈ ముఠాలో ప్రధాన పాత్రదారులు. ఇరానీ పాత్ర్ అందంగా తయారయ్యి తన ఫొటోలను పేస్బుక్లో పోస్టు చేసేది. ప్రొఫైల్లో తన ఫొటో ఉంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపేది. దానిని అంగీకరించిన వారితో నిత్యం చాట్ చేసేంది. కొన్నాళ్లకు వారి వద్ద నుంచి ఫోన్ నెంబరు తీసుకొని రెచ్చగొట్టే మెసేజ్లు పంపేది. తర్వాత వారిని కలవాలంటూ ఇంటికి పిలిపించుకునేది. అలా వెళ్లిన యువకులను గదిలో కూర్చోబెట్టి కాసేపు కబుర్లు చెప్పేది. ఆ తర్వాత వారితో కొంత సన్నిహితంగా ఉన్నట్లు నటించి రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీయించేంది.
ఈ తతంగం ముగిశాక చాటుగా వీడియో తీసిన ఇద్దరు మారణాయుధాలతో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బు దోచుకొనేవారు. మహిళతో సన్నిహితంగా ఉండగా తీసిన వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్కు దిగేవారు. ఇలా అందిన కాడికి దోచుకోవడం వీళ్లకు అలవాటై పోయింది. ఈ క్రమంలో భువనేశ్వర్కి చెందిన ఓ యువకుడి భార్యకు ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.3.60 లక్షలు కాజేశారు. దీనిపై భువనేశ్వర్ తమాండొ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసుపై దర్యాప్తు జరిపగా ఈ ముఠా గుట్టు రట్టైంది. ఈ ముఠాను దర్యాప్తు చేసిన పోలీసులు ముఠాను శనివారం అరెస్టు చేశారు. దీంతో పలు పోలీస్ స్టేషన్లలో వీరిపై నమోదైన ఎన్నో కేసులు వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.