కేరళలో ఓ 14 ఏళ్ల బాలుడి ప్రాణాలు బలితీసుకున్న ‘నిపా’ వైరస్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మరణం నిపా వైరస్ కారణంగానే సంభవించిందని ధృవీకరించుకున్న వెంటనే కేరళకు వైద్య బృందాన్ని పంపించింది. ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. కేరళ రాష్ట్రానికి ఆ మేరకు సూచనలు జారీ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. కేస్ ఇన్వెస్టిగేషన్, వ్యాధి సంక్రమణ విస్తృతిని గుర్తించేందుకు సాంకేతిక సహాయాన్ని అందించనుంది. కేరళలోని మల్లాపురం జిల్లాలో నిపా వైరస్ కేసు నమోదైంది. మల్లాపురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆ వ్యాధి లక్షణాలతో బాధపడుతుండడంతో కోజికోడ్లోని ఉన్నత ఆరోగ్య కేంద్రానికి తరలించే ముందు పెరింతల్మన్నలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో చేర్చారు. అయితే ఆ వ్యాధి తీవ్రత కారణంగా బాలుడు మృతి చెందాడు. అప్పటికే రక్తం నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపగా ‘నిపా’ వైరస్ సోకినట్లు ల్యాబ్ టెస్టులో తేలింది. వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ నిపుణులైన వైద్య బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ ‘వన్ హెల్త్ మిషన్’ నుంచి బహుళ-సభ్య జాయింట్ రెస్పాన్స్ టీమ్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారు నిపా కేసులపై దర్యాప్తు చేయడంతో పాటు ఎపిడెమియోలాజికల్ లింకేజీలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తారని కేంద్రం తెలిపింది.
అదనంగా, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు, రోగులకు అందించే చికిత్సలో భాగంగా ICMR మోనోక్లోనల్ యాంటీబాడీలను కేరళ రాష్ట్రానికి పంపించింది. అలాగే రోగి కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యక్తుల నుంచి అదనపు నమూనాలను పరీక్షించడానికి మొబైల్ BSL-3 ప్రయోగశాలను కోజికోడ్కు పంపించగా, ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ రోగి చనిపోడానికంటే ముందే అక్కడికి చేరుకున్నప్పటికీ, రోగి పరిస్థితి విషమించడంతో వాటిని ఉపయోగించడానికి వీలు కాలేదు.
గతంలో కూడా నిపా వైరస్ వ్యాధి (NiVD) వ్యాప్తి కేరళలో జరిగింది. గత ఏడాది కోజికోడ్ జిల్లాలోనే ఈ వైరస్ కేసులను అధికారులు గుర్తించారు. పండ్లను తినే గబ్బిలాలే నిపా వైరస్ విషయంలో రిజర్వాయర్లుగా పనిచేస్తున్నాయి. అనేక ప్రాణాంతక వైరస్లకు గబ్బిలాలు నిలయం అన్న విషయం తెలిసిందే. గబ్బిలాలు కొరికిన పండ్లను తిన్నవారికి నిపా వైరస్ సోకుతోంది. ఆ తర్వాత ఒక రోగి నుంచి మరొకరికి ఈ వ్యాధి సంక్రమణ జరుగుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. గతంలో కోవిడ్-19 సమయంలో అనుసరించిన కఠిన క్వారంటైన్ విధానాలతోనే ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించగలం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అమలు చేయాల్సిన బాధ్యత ప్రజంలదరిపైనా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..