యువతలో అత్యధిక మరణాలకు ప్రధాన కారణం ఇదేనట.. నివేదికలో సంచలన విషయాలు

దేశవ్యాప్తంగా ఆత్మహత్య కేసులు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువత.. ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.. ఈ ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.. ఎన్నో కలలతో ఆసరా నిలుస్తారనుకున్న వారు.. అలా అర్ధాంతరంగా బలవన్మరణాలకు పాల్పడుతుండటం.. కన్నోళ్లకు కడుపుకోత మిగుల్చుతోంది..

యువతలో అత్యధిక మరణాలకు ప్రధాన కారణం ఇదేనట.. నివేదికలో సంచలన విషయాలు
Youth

Edited By:

Updated on: Jun 26, 2025 | 12:48 PM

దేశవ్యాప్తంగా ఆత్మహత్య కేసులు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువత.. ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.. ఈ ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.. ఆసరా నిలుస్తారనుకున్న వారు అలా అర్ధాంతరంగా బలవన్మరణాలకు పాల్పడుతుండటం.. కన్నోళ్లకు కడుపుకోత మిగుల్చుతోంది.. అయితే.. భారతదేశంలో యువత ఆత్మహత్యలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. దేశంలో యువత (వయస్సు 15–29 సంవత్సరాలు) మరణానికి ప్రధాన కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఆత్మహత్య నిలుస్తోంది. 2020–22 మధ్యకాలంలో నిర్వహించిన SRS Cause of Death నివేదిక ప్రకారం.. 15–29 మధ్య వయసు గల యువతలో ప్రతి ఆరు మరణాల్లో ఒకటి ఆత్మహత్య కారణంగా జరుగుతోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారమే కాకుండా.. భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం కూడా నిర్ధారితమైంది.

ఆత్మహత్యలు మహిళలలో 18.2% మృతులకు కారణంగా ఉండగా, పురుషులలో ఇది 16.3%గా ఉంది. మొత్తంగా చూస్తే 15-29 ఏళ్ల వయస్సులో 17.1% మంది ఆత్మహత్య వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆత్మహత్యలకు తరువాతి స్థానాల్లో రోడ్ యాక్సిడెంట్లు (15.6%), గుండె సంబంధిత వ్యాధులు (9.6%), ఆకస్మిక ప్రమాదాలు (8.7%), జీర్ణ సంబంధిత వ్యాధులు (6.4%), శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు (5.3%) ఉన్నాయి.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. 18–30 ఏళ్ల మధ్య suicides కు ప్రధాన కారణాలు ఇవే..

ప్రేమ విఫలం కేసులు (34.2%)

పెళ్లి సంబంధిత సమస్యలు (8%)

మానసిక అనారోగ్యం (7.4%)

కుటుంబ వివాదాలు (7.5%)

డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యసనం (5.2%) అని నివేదికలో తెలిపింది.

పురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువ..

మరో విషయం ఏమంటే.. పెళ్లి సంబంధిత సమస్యల కారణంగా జరిగే ఆత్మహత్యల్లో 28% మాత్రమే పురుషులవిగా నమోదు కాగా, మిగిలిన 72% మహిళలవే కావడం గమనార్హం. అదే విధంగా, భారత్‌లో 15–29 ఏళ్ల వయస్సు గల వారిలో ఆత్మహత్యల సంఖ్య 60,000కు పైగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.. ఇది చైనా కంటే 6 రెట్లు అధికం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ దృష్ట్యా మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, హెల్ప్‌లైన్ నంబర్లు, సంప్రదించదగిన మానసిక నిపుణుల సేవలను అందుబాటులో ఉంచడం అత్యవసరం.. అని ఈ నివేదిక సూచిస్తోంది.. జీవితం విలువైనది.. దాన్ని అర్ధాంతరంగా ముగించడం కంటే.. సమస్యలను సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఎలాంటి పెద్ద సమస్య అయినా.. చిటికెలో పరిష్కారం అవుతుంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..