లడఖ్ లోని పరిస్థితిపై తమ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దేశభక్తి, జాతీయవాదం లేదా జాతీయత కేవలం ఎన్ డీ ఏ-బీజేపీల గుత్తాధిపత్యమేమీ కాదని…. న్యాయశాఖ మంత్రి (రవిశంకర్ ప్రసాద్)గురించి అయితే మరింత తక్కువగా చెప్పుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. ప్రభుత్వాన్ని క్లిష్టతరమైన ప్రశ్నలను అడగడం దేశభక్తి లేకపోవడం కాదని, ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడమే దేశభక్తి లేదనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. చైనా సైనికులు మన దేశ భూభాగాల్లో ఎన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారని, ఆ ప్రాంతాల నుంచి వారిని తరిమివేయడానికి లేదా మన భూభాగాలను దక్కించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు.
లడఖ్ లోని భారత భూభాగంలో సుమారు 40 నుంచి 60 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాలను చైనా దళాలు ఆక్రమించుకున్నాయని మాజీ సైనికాధికారులు, రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్త పరచిన విషయాన్ని మనీష్ తివారీ గుర్తు చేశారు. ఇందుకు కారకులెవరని మోదీని ప్రశ్నించిన ఆయన.. మీరు బాధ్యత వహిస్తారా అన్నారు. ఆన్ లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన తివారీ…ఇప్పటికైనా తాము అడిగిన ప్రశ్నలకు బీజేపీ సమాధానాలు చెప్పాలన్నారు. కాగా.. అంతర్జాతీయ అంశాల గురించి రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించజాలరని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.