
భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జూలై 25, 2025 నాటికి ఎక్కువ కాలం భారత ప్రధానిగా ( 4,078 రోజులు) పనిచేసిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు. గతంలో 1964 నుంచి 1977 మధ్య నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా దివంగత ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి వ్యక్తిగా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిలవగా, ఆయన తర్వాత ప్రస్తుతం ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు.
స్వతంత్ర భారతదేశంలో జన్మించిన తొలి ప్రధానమంత్రి అయిన 74 ఏళ్ల మోదీ, గత ఏడాది జూన్లో వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 26, 2014న తొలిసారి అత్యున్నత పదవిలోకి అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, కాంగ్రెసేతర పార్టీ నుండి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా నరేంద్ర మోదీ నిలిచారు.
జూలై 25న శుక్రవారంతో ప్రధాని మోడీ వరుసగా మూడు పర్యాయాలు 4,078 రోజుల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయన భారతదేశంలో వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు వరుసగా 4,077 రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీని అధిగమించి ప్రధాని మోదీ రెండో స్థానంలోకి వచ్చారు.
ఇందిరా గాంధీ జనవరి 14, 1980 నుండి అక్టోబర్ 31, 1984న ఆమె హత్యకు గురయ్యే వరకు ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఆగస్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా పనిచేసి, భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు.
ప్రధానమంత్రి కాకముందు, 2001 నుండి 2014 వరకు అత్యధిక కాలం గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ప్రధాని మోదీ పనిచేశారు. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు. అయితే ప్రధానమంత్రిగా రెండు పదవీకాలాలను పూర్తి చేసుకొని వరకుసగా మూడోసారి కూడా ప్రధానిగా ఎన్నికైన మొదటి ఏకైక కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోదీ నిలిచారు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు కూడా నరేంద్ర మోదీనే!
తొలిసారిగా 2014లో 272 సీట్లతో భారీ మెజారిటీతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు మోదీ బీజీపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాల్లో 303 గెలుచుకుని బీజేపీ తన సంఖ్యను మరింత మెరుగుపరుచుకుంది. అయితే 2024లో జరిగిన ఎన్నిల్లో బిజెపీ సగం స్థానాలను కోల్పోయినప్పటికీ NDA భాగస్వాముల మద్దతుతో వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దీంతో నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.