జెసికా లాల్ అనే మోడల్ హత్య కేసులో దోషి మనుశర్మ ఢిల్లీ లోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతనితో బాటు మరో 18 మంది కూడా రిలీజయ్యారు. జైలు శిక్షల రివ్యూ బోర్డు సిఫారసు మేరకు మను శర్మ విడుదలను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించారు. మాజీ మంత్రి వినోద్ శర్మ కొడుకైన మను శర్మ జైల్లో చాలా ‘సత్ప్రవర్తనతో’ ఉండేవాడట.. ఇతని మంచి ప్రవర్తన కారణంగా ఉదయం 8 గంటలకు ఇతగాడు జైలును వీడ వచ్చునని, తిరిగి సాయంత్రం 6 గంటలకు జైలుకు చేరాలని నిబంధన విధించారట.. కాగా 1999 ఏప్రిల్ 30 న ఓ బార్ లో తనకు మద్యం సర్వ్ చేయనందుకు మోడల్ జెసికా లాల్ ను మనుశర్మ తన గన్ తో కాల్చి చంపాడు. ఈ కేసులో చాలాసార్లు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో విచారణలు జరిగాయి. చివరకు 2007 డిసెంబరు 20 న మనుశర్మకు యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. జెసికా లాల్ చెల్లెలు సబ్రీనా లాల్.. ఇతడ్ని తాను క్షమిస్తున్నానని, జైలు నుంచి ఇతని విడుదలకు తనకు అభ్యంతరం లేదని ప్రకటించింది. జైల్లో ఇతని సత్ప్రవర్తన గురించి తెలుసుకున్నానని ఆమె 2018 లోనే వెల్లడించింది.