Maharashtra Political Crisis: బీజేపీ హైకమాండ్ నుంచి ఫడ్నవీస్కు పిలుపు.. మహా క్లైమాక్స్కు తెరపడనుందా..?
భారతీయ జనతా పార్టీ (BJP) హైకమాండ్ పిలుపుతో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు.
Maharashtra Political Crisis: వారం నుంచి కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా బీజేపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం హస్తినకు షిఫ్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ (BJP) హైకమాండ్ పిలుపుతో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు. ఫడ్నవీస్తో పాటు ప్రత్యేక విమానంలో ప్రముఖ లాయర్ మహేశ్ జెఠ్మలానీ కూడా ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షాలతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ కానున్నారు. మహారాష్ట్ర సంక్షోభానికి తెరదించే అంశంపై పార్టీ పెద్దలతో ఫడ్నవీస్ మంతనాలు జరపనున్నారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్షిండే వర్గంతో కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఫడ్నవీస్ షిండేతో చర్చలు జరిపారు.
ఆదివారం నాటికి కొత్త ప్రభుత్వం..
షిండే వర్గం మద్దతుతో MVA ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ సన్నద్ధంగా ఉందంటూ ఆపార్టీకి చెందిన ఓ నాయకుడు పేర్కొన్నారు. రెబల్ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే ఒకటి లేదా రెండు రోజుల్లో నగరంలోకి వచ్చి, MVA ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిన నేపథ్యంలో బలపరీక్షకు పిలవాలని కోరుతూ గవర్నర్ BS కోష్యారీకి లేఖను అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతా అనుకూలిస్తే ఆదివారం నాటికల్లా మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలో కొత్త సంకీర్ణ సర్కారు కొలువుతీరుతుందని ఆపార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తిరుగుబాటు నేతలో షిండే భేటీ..
అస్సాంలోని గౌహతిలో షిండే వర్గం ఎమ్మెల్యేల శిబిరం కొనసాగుతోంది. మరో రెండు రోజులపాటు వారు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ముంబై చేరుకోనున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. తదుపరి కార్యాచరణ ప్రణాళిక కోసం ఏక్నాథ్ షిండే బృందం ఈ రోజు మధ్యాహ్నం సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమైన బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాక్రే ఈరోజు మధ్యాహ్నం క్యాబినేట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. తదుపరి కార్యాచరణపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని గవర్నర్ ఆదేశించొచ్చన్న కథనాల నేపథ్యంలో ఉద్ధవ్ క్యాబినేట్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..