యూపీలో మారనున్న మరో నగరం పేరు..! సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన
ఉత్తరప్రదేశ్లో మరో నగరం పేరును కూడా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక ప్రకటన చేశారు. నరేంద్ర మోదీ సర్కారు కేంద్రంలో మూడోసారి అధికారంలో వస్తే అక్బర్పూర్ పేరును మార్చేస్తామని ఆయన తెలిపారు. ఆ నగరం పేరును ఉచ్చరిస్తే చెడు రుచి వస్తుందన్నారు.
ఉత్తరప్రదేశ్లో మరో నగరం పేరును కూడా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. నరేంద్ర మోదీ సర్కారు కేంద్రంలో మూడోసారి అధికారంలో వస్తే అక్బర్పూర్ నగరం పేరును మార్చేస్తామని ఆయన తెలిపారు. ఆ నగరం పేరును ఉచ్చరిస్తే చెడు రుచి వస్తోందని.. ఇవన్నీ మారిపోతాయని హామీ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత బానిసత్వ గుర్తులను చెరిపేసి, భారత సంస్కృతికి పెద్దపీట వేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు దీనిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే.. అక్బర్పూర్ పేరు మార్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల వేళ మొఘల్ చక్రవర్తి అక్బర్ పేరిట ఉన్న అక్బర్పూర్ నగరం పేరును మారుస్తామని యోగీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
అక్బర్పూర్తో పాటు అలీఘడ్, అజంఘడ్, షాజహాన్పూర్, ఘజియాబాద్,ఫిరోజాబాద్, ఫరూఖాబాద్, మొరదాబాద్ పేర్లను మార్చాలన్న డిమాండ్లను యోగి ఆదిత్యనాథ్ పరిశీలనలో ఉన్నాయి. 2017లో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. యూపీలోని పలు రోడ్లు, పార్కులు, భవంతులు, కూడళ్ల పేర్లను మార్చారు. వీటిలో చాలా వాటికి మాజీ ప్రధాని వాజ్పేయి పేరు పెట్టారు. ఒక్క లక్నోలోనే అటల్ బిహారి వాజ్పేయి రోడ్, అటల్ చౌరాహ, అటల్ బిహారి వాజ్పేయి కాన్ఫెరెన్స్ సెంటర్, అటల్ సేతు, అటల్ బిహారి కల్యాణ మండపం పేరు పెట్టారు.
ఇటీవల ఆ రాష్ట్రంలోని ముఘల్సరాయ్ రైల్వే స్టేషన్ పేరును దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్గా పేరు మార్చడం తెలిసిందే. 2019లో కుంభమేళాకు ముందు అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా పేరు మార్చారు. అలీఘడ్, హరిఘడ్ పేరు మార్పునకు ఆయా మున్సిపాలిటీలు నిర్ణయం తీసుకున్నాయి. మెయిన్పురి పేరును మాయాపురి, ఫిరోజాబాద్ పేరును చంద్రా నగర్గా మార్చాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.