మహారాష్ట్ర అప్ డేట్స్.. గవర్నర్ పిలుపు ఎవరికి ?

| Edited By: Anil kumar poka

Oct 28, 2019 | 6:22 PM

మహారాష్ట్రలో అధికార పగ్గాలను సరిసమానంగా పంచుకునే విషయమై బీజేపీ-శివసేన మధ్య కొత్త రగడ మొదలైన సంగతి తెలిసిందే. 50 : 50 షేర్ కావాలని శివసేన నేత సంజయ్ రౌత్ గళమెత్తినప్పటినుంచీ మెల్లగా అధినాయకత్వం కూడా ఇదే డిమాండును పదేపదే బీజేపీ వద్ద ప్రస్తావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇందుకు విముఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆ పార్టీ దీనిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల ప్రతినిధి బృందాలూ సోమవారం రాజ్ భవన్ లో […]

మహారాష్ట్ర అప్ డేట్స్.. గవర్నర్ పిలుపు ఎవరికి ?
Follow us on

మహారాష్ట్రలో అధికార పగ్గాలను సరిసమానంగా పంచుకునే విషయమై బీజేపీ-శివసేన మధ్య కొత్త రగడ మొదలైన సంగతి తెలిసిందే. 50 : 50 షేర్ కావాలని శివసేన నేత సంజయ్ రౌత్ గళమెత్తినప్పటినుంచీ మెల్లగా అధినాయకత్వం కూడా ఇదే డిమాండును పదేపదే బీజేపీ వద్ద ప్రస్తావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇందుకు విముఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆ పార్టీ దీనిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల ప్రతినిధి బృందాలూ సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిశాయి. దివాకర్ రౌత్ ఆధ్వర్యాన శివసేన బృందం మొదట ఆయనతో భేటీ కాగా-కొద్దిసేపటికే బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వాన ఈ పార్టీ నేతలు ఆయనతో సమావేశమయ్యారు. అయితే దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకే తాము ఆయనను కలిశామని ఫడ్నవీస్ ఆ తరువాత ట్వీట్ చేశారు. అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఆయన వద్ద ప్రస్తావించామన్నారు.
ఈ ఎన్నికల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే సూచనలున్నాయి. కానీ ఇక్కడ శివసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ..మెజారిటీ మార్క్ కు అవసరమైనన్ని సీట్లను పొందలేకపోవడంతో.. చిక్కొఛ్చి పడింది. (బీజేపీ 105 స్థానాలను, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి).

చెరిసగం అధికారాన్ని పంచుకోవాలన్న ప్రతిపాదనను శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే బీజేపీకి గుర్తు చేశారు. ఈ విషయమై ఇదివరకే రెండు పార్టీల మధ్యా ఒప్పందం కుదిరిందన్నారు. ‘ప్రతిసారీ మేం కమలనాథులను ‘ ఎకామడేట్ ‘ చేయలేం.(ఆ పార్టీతో సర్దుకు పోలేం).. .మేం కూడా రాజకీయంగా ఎదగాలి కదా ‘ అని ఆయన వ్యాఖ్యానించారు.బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కుదిరిన ఫార్ములాను అమలు చేయాల్సి ఉందన్నారు.
ఇదిలా ఉండగా.. ఉధ్దవ్ థాక్రేకి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మధ్య, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షా మధ్య సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. వీరిద్దరూ శివసేనను బుజ్జగించవచ్చు .అదే సందర్భంలో అధికార పంపిణీపై బీజేపీ- శివసేన ఓ అవగాహనకు రావచ్చునని భావిస్తున్నారు.