Current Bill: గుడిసెలో నివాసముంటూ.. పలు ఇళ్లల్లో పనిచేస్తూ ఆ వృద్ధురాలు జీవనం కొనసాగిస్తోంది. ఆ గుడిసెలో కేవలం ఒక బల్బు, టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. ఎప్పుడూ నెలకు రూ. 300లు వచ్చే కరేంట్ బిల్లు.. ఆమెకు ఒక్కసారిగా షాకిచ్చింది. వందలు, వేలు కాకుండా.. కరెంటు బిల్లు ఒక్కసారిగా లక్షల్లో వచ్చింది. దీంతో ఆమె రూ.లక్షల్లో వచ్చిన బిల్లు రశీదు చేతబట్టుకొని నిద్రలేకుండా విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఈ షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్లోని గునాలో చోటుచేసుకుంది. గునా ప్రాంతంలో రాంబాయి ప్రజాపతి అనే 65 ఏళ్ల వృద్ధురాలు పూరి గుడిసెలో ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. ఆమె నివాసం ఉంటున్న గుడిసెలో ఒక బల్బు, టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి.
వీటికి సంబంధించి ప్రతి నెలా రూ.300 నుంచి రూ.500 వరకు కరెంట్ బిల్లు వచ్చేంది. అయితే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా ఆమె విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో పదిరోజుల క్రితం ఏకంగా రూ.2.5 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. దీనిని చూసి షాకైన రాంబాయి ఆ కరెంట్ బిల్లు రశీదును తీసుకొని వారం రోజులుగా విద్యుత్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతోంది.
అయితే ఎవరూ కూడా దీని గురించి పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. ఊరు పెద్దలతోపాటు జిల్లా కలెక్టర్ను కలిసినప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదని ఆ వృద్ధురాలు వాపోయింది. తాను ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నానని.. తన ఇంట్లో బల్బు, టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉన్నాయని పేర్కొంది. తన సమస్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపింది. కాగా.. ఈ విషయంపై విద్యుత్ అధికారులు స్పందించలేదు.
Also Read: