Karnataka: సీఎం పదవిపై శాసన సభ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్దరామయ్య..!

తానే ఐదేళ్లపాటు కర్ణాటక ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీ సాక్షిగా సిద్దరామయ్య ప్రకటించారు. డీకే శివకుమార్‌తో సీఎం పదవిపై ఎలాంటి డీల్‌ లేదన్నారు. హైకమాండ్‌ మద్దతు తనకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుంటే, సిద్దరామయ్య నేతృత్వంలో పనిచేయడానికి అభ్యంతరం లేదన్న డీకే లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Karnataka: సీఎం పదవిపై శాసన సభ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన  సిద్దరామయ్య..!
Karnataka Cm Siddaramaiah, Dk Shivakumar

Updated on: Dec 19, 2025 | 10:50 PM

తానే ఐదేళ్లపాటు కర్ణాటక ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీ సాక్షిగా సిద్దరామయ్య ప్రకటించారు. డీకే శివకుమార్‌తో సీఎం పదవిపై ఎలాంటి డీల్‌ లేదన్నారు. హైకమాండ్‌ మద్దతు తనకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుంటే, సిద్దరామయ్య నేతృత్వంలో పనిచేయడానికి అభ్యంతరం లేదన్న డీకే లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్దరామయ్య. సీఎం పదవిపై డీకే శివకుమార్‌తో ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదని తెలిపారు. చెరో రెండున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని సిద్దరామయ్య తేల్చి చెప్పారు. ఐదేళ్ల పాటు తానే సీఎం పదవిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ సిద్దరామయ్య వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు హైకమాండ్‌ సంపూర్ణ మద్దతు ఉందన్నారు సిద్దరామయ్య. అయితే ఈ వ్యవహారంపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని డీకే శివకుమార్‌ అన్నారు. ఇదిలావుంటే, అసెంబ్లీ సాక్షిగా సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు డీకే శివకుమార్‌ క్యాంప్‌లో కలవరం రేపాయి. తనకు మెజారిటీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్నారు సిద్దరామయ్య.

సీఎం పదవిపై సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో డీకే శివకుమార్‌ పుణ్యక్షేత్రాలను సందర్శంచడం అందరి దృష్టిని ఆకర్షించింది. అమావాస్య వేళ అమ్మవారి ఆలయాలను డీకే శివకుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం పదవిపై సిద్దరామయ్య వ్యాఖ్యలపై స్పందించారు డీకే శివకుమార్‌. తనకు , సిద్దరామయ్యకు మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ వ్యవహారాలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సిద్దరామయ్య , డీకే శివకుమార్‌ ఆధిపత్య పోరుతో కర్ణాటకలో అభివృద్ది కుంటుపడిందన్నారు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి. కర్నాటక వ్యవహారాలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ పట్టు కోల్పోయింది అన్నారు. అందుకే సిద్దరామయ్య రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘కాంగ్రెస్‌ దగ్గర ఇప్పుడు కమాండ్‌ లేదు. కమాండ్ లేనప్పుడు నిర్ణయం రాదు. తానే సీఎం అవుతానని డీకే శివకుమార్‌ చెబుతారు.. నవంబర్‌ , డిసెంబర్‌ లోనే పగ్గాలు చేపట్టాలి.. కాని కాస్త ఆలస్యమయ్యిందని చెబుతారు. ఇద్దరు కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ చేస్తారు.. ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని అంటారు. హైకమాండ్‌ దగ్గర చెప్పడానికి ఏమి లేదు’’ అని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

సిద్దరామయ్య తాజా వ్యాఖ్యలతో డీకే శివకుమార్‌ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. పైకి సిద్దరామయ్య నాయకత్వాన్ని సమర్ధిస్తునట్టు డీకే చెప్పినప్పటికీ, లోలోన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..