
కర్ణాటక, మే 24: నీట్ పేపర్ లీక్ మరో విద్యార్ధిని బలి తీసుకుంది. కర్ణాటకలోని కలబురిగిలో నీట్ విద్యార్థిని భాగ్యలక్ష్మి (18) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ వంటివి ఏమీ లభ్యం కాలేదు. భాగ్యలక్ష్మి మృతిపై ఆమె తండ్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. తమ కుమార్తె చదువులో ఎప్పుడూ ముందుండేదని అన్నారు. 12వ తరగతి పరీక్షల్లో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. నీట్ పరీక్షపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కుమార్తె.. ఆ పరీక్ష రద్దుతో తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలిపాడు. భాగ్యశ్రీ తన అపార్ట్మెంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి సూసైడ్ లెటర్ లభించలేదు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలన నిర్వహించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా ఇటీవల నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల నీట్ విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మే 16న రాజస్థాన్లో ప్రదీప్ మేఘ్వాల్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి పరీక్ష బాగా రాసిందని, ఈసారి సుమారు 650 మార్కులు వస్తాయని ఆశించాడు. అయితే అనూహ్యంగా పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
గత మూడు సంవత్సరాలుగా ఓ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ తన ఇద్దరు అక్కలతో కలిసి సికార్లో నివసిస్తున్నాడు. అయితే నీట్ అవకతవకలు, ప్రశ్నపత్రం లీక్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో నీట్ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన అతడు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ పరీక్ష రద్దు తర్వాత గత 12 రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య ఐదుకు చేరుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.